హైదరాబాద్, వెలుగు: వన్ నేషన్ వన్ రేషన్తో రాష్ట్రంలో 10 లక్షల మందికిపైగా ప్రయోజనం కలగనుంది. కేంద్రం బడ్జెట్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో కొత్త సంస్కరణలు తెస్తున్నట్టు ప్రకటించింది. వన్ నేషన్ వన్ రేషన్ను అన్ని రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో అమలు చేస్తామని తెలిపింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చినవారు, మన రాష్ట్రం నుంచి ముంబై, సూరత్ ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు లబ్ధిపొందనున్నారు. గతంలో ఫ్యామిలీ మెంబర్లు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే.. ఏదో ఒకచోట మొత్తం రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వేర్వేరు చోట్ల ఎవరికి అవసరమైనంత వారు తీసుకునే చాన్స్ అందుబాటులోకి రానుంది.
వలస కార్మికులకు భరోసా
దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ స్కీం అమల్లోకి వస్తుండటం వలస కార్మికులకు ఎక్కువ ప్రయోజనం కలిగించనుంది. కరోనా టైంలో సొంతూళ్లకు వెళ్లిపోయిన కార్మికులు.. తిరిగి పనులున్న ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుంటుంది. మన రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు వేరేర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లోని పలు సిటీలకు వలస వెళ్లారు. వారంతా ఆయా చోట్ల రేషన్ తీసుకోవడానికి చాన్స్ అందుబాటులోకి వస్తోంది.