యువకుడి వేధింపులు..ఇద్దరు పిల్లలతో మహిళ సూసైడ్

యువకుడి వేధింపులు..ఇద్దరు పిల్లలతో మహిళ సూసైడ్

యువకుడి వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలను చంపి ఓ మహిళ తానూ సూసైడ్ చేసుకున్న ఘటన ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో చోటుచేసుకుంది. వేములవాడ రూరల్ సీఐ రఘు చందర్ తెలిపిన వివరాల ప్రకారం..  బోయినపల్లికి చెందిన పెద్ది శ్రీనివాస్ తో  అదే గ్రామానికి చెందిన సంబ చిలకమ్మ, నర్సయ్య ల కూతురు మమతకు ఐదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంత కాలంగా మమతను వేధించేవాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త శ్రీనివాస్ ఆ యువకుడిని మందలించాడు. ఈ విషయంలో విబేధాలు రావడంతో మమతను శ్రీనివాస్ పుట్టింటికి పంపాడు. తర్వాత  నచ్చజెప్పి మళ్లీ ఇంటికి తీసుకొచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాస్ పొలం పనులకు వెళ్లి వచ్చేసరికి కూతుళ్లు శ్రీకృతి (4), రిషిత (2) లను ఉరివేసి చంపిన మమత (25) తానూ ఉరివేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.