
గచ్చిబౌలి కొండాపూర్ లోని ప్లాన్ బీ ఫర్టిలిటి ఆస్పత్రిలో దారుణం జరిగింది. సంతానం కోసం వెళితే ప్రాణాలు తీశారు. గచ్చిబౌలి పోలీసుల వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన పల్లవికి(29) గత నాలుగేళ్ల క్రితం పెళ్లి అయినా సంతానం కలగకపోవడం తో ప్లాన్ బీ ఫర్టిలిటీ లో చికిత్స తీసుకుంటుంది. ఇందులో భాగంగా జూన్ 10న ఉదయం ప్లాన్ బీ ఫర్టిలిటి సెంటర్ లో జాయిన్ చేశారు ఆమె కుటుంబ సభ్యులు.
పల్లవిని పరిశీలించిన డాక్టర్లు గర్భ సంచిలో నీటి బుడగలు ఉన్నాయి సర్జరీ చేయాలని చెప్పారు. కాసేపటి తర్వాత సర్జరీ సక్సెస్ అయిందంటూ కుటుంబ సభ్యుల చేత బిల్లు కట్టించుకున్నారు ప్లాన్ బీ ఫర్టిలీటి యాజమాన్యం. ఆ తర్వాత కాసేపటికి గుండెపోటుతో చనిపోయిందంటూ కుటుంబ సభ్యులకు చెప్పారు డాక్టర్లు. దీంతో పల్లవి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.సంఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ లో ఇష్టారాజ్యంగా వెలుస్తున్న ఫర్టిలిటీ సెంటర్లు మహిళల ప్రాణాలు తీస్తున్నయ్. పిల్లల సెంటిమెంట్ తో బలహీనతను అడ్డంపెట్టుకుని లక్షలు దోచుకుంటున్నారు నిర్వాహకులు. తీరా సంతానం కల్గుతుందా? అంటే దేవుడెరుగు..ప్రాణాలతో ఉంటే చాలన్న కాడికి వస్తుంది పరిస్థితి.