నల్గొండ రేప్.. ధర్నా చేస్తున్న మహిళా సంఘాలపై మంత్రి అసహనం

నల్గొండ రేప్.. ధర్నా చేస్తున్న మహిళా సంఘాలపై మంత్రి అసహనం

రాష్ట్రంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నల్లగొండ జిల్లా ముషంపల్లిలో మహిళపై అత్యచారం చేసి, హత్య చేశారు ఇద్దరు వ్యక్తులు. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. మృతురాలికుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి జగదీశ్ రెడ్డి.

గంజాయి మత్తులో సైదాబాద్ చిన్నారిపై హత్యాచారం ఘటన మరువక ముందే... నల్గొండ జిల్లాలో మరో దారుణం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న మహిళను ఇంట్లోకి లాకెళ్లి మద్యం మత్తులో అత్యాచారం చేశారు ఇద్దరు వ్యక్తులు. తర్వాత ఆమె తలను నేలకు, గోడకేసి కొట్టి దారుణంగా చంపేశారు. ఆధారాలు దొరక్కుండా రక్తపు మరకలు కడిగేశారు. డెడ్ బాడీని బయట రేకుల షెడ్ కింద పడేశారు. నల్లొండ జిల్లా ముషంపల్లిలో ఈ ఘటన జరిగింది.

ముషంపల్లికి చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇంటికి కొద్ది దూరంలో వీళ్లు కిరాణాషాపు నడిపిస్తున్నారు. షాప్ కు వెళ్తున్న టైంలో అదే గ్రామానికి  చెందిన బక్క తొట్ల లింగయ్య, ఏర్పుజర్ల పుల్లయ్య మహిళను ఇంట్లోకి లాక్కెళ్లారు. అత్యాచారం చేసి చంపేశారు. శవాన్ని రోడ్డుపై పడేసి... నిందితులే వెళ్లి మహిళ అక్కడ పడిపోయి ఉందని డ్రామా ఆడారు.

స్పాట్ కు వచ్చిన పోలీసులు అనుమానంతో నిందితుల ఇళ్లను సోదా చేశారు. ఇంట్లో రక్తపు మరకలు గుర్తించి మద్యం మత్తులో అఘాయిత్యం చేసినట్లు గుర్తించారు. పోస్టుమార్టం తర్వాత మహిళ డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. నిందితులను చితకబాది పోలీసులకు అప్పజెప్పారు గ్రామస్థులు.

నిందితులు లింగయ్య, పుల్లయ్యల ఇద్దరిది నేర చరిత్రే. పుల్లయ్య మొదటి భార్య విడాకులు ఇవ్వడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూడా భర్తను వదిలి వెళ్లిపోయింది. మరో నిందితుడు లింగయ్య ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో... అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వారం కిందటే గ్రామంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు లింగయ్య.

మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై మహిళా సంఘాలు, ఆర్య వైశ్య సంఘం భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ నల్గొండలో భారీ ర్యాలీ తీశాయి. క్లాక్ టవర్ దగ్గ భారీ మానవ హారం నిర్వహించాయి. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమన్నారు మహిళా సంఘాల నేతలు. ఎస్పీ రంగనాథ్ కు వినతి పత్రం ఇచ్చారు. ముషంపల్లి ఘటన అమానుషమంటూ ఆందోళన చేపట్టారు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు. అత్యాచారం, హత్యకు గురైన మహిళ కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీ ముందు మంత్రి జగదీష్ రెడ్డిని.. మహిళ సంఘాలు ప్రశ్నించే ప్రయత్నం చేశాయి. దీంతో అసహనానికి గురైన మంత్రి.. మీ పార్టీలో ఓ ఎంపీ రాద్దాంతం చేస్తున్నాడు.. ఆ విషయాన్ని చూసుకోండి.. ప్రభుత్వం ఏంచేయాలో మేము చూసుకుంటామంటూ వెళ్ళిపోయారు. మంత్రి మాటలను తప్పుపట్టారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునిత రావు.

ముషంపల్లి ఘటన దురదృష్టకరమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మృతురాలి భౌతికఖాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ జరిపిస్తామని చెప్పారు.