పెళ్లికి నిరాకరించిన ప్రియుడు తనకే దక్కలనుకుంది ఓ యువతి. పక్కా ప్లాన్ వేసిన యువతి అతడిపై యాసిడ్ దాడి చేసింది. తన ప్రియడు ఎవ్వరికీ దక్కవద్దనే ఆలోచనతో ఆమె పథకం పన్నిందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జూన్ 11న ఢిల్లీలో జరుగగా ఆలస్యంగా బయటపడింది.
వివరాలు ఇలా ఉన్నాయి..
వికాస్పురి ప్రాంతానికి చెందిన ఓ యువతి మూడేళ్లుగా ఓ వ్యక్తితో ప్రేమలో ఉంది. ఇటీవల వారి మధ్య మనస్పర్థలు రావడంతో.. ఆ వ్యక్తి యువతితో పెళ్లికి నిరాకరించాడు. దీంతో అతడిని దక్కించుకోవాలని యువతి పక్కా ప్లాన్ వేసింది. జూన్ 11న తన ప్రియుడితో కలిసి బైక్పై ప్రయాణిస్తూ.. వెనుకనుంచి యాసిడ్తో దాడి చేసింది. తర్వాత తనపై కూడా కొంత యాసిడ్ను చల్లుకుంది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు ఎవరో మనపై యాసిడ్ విసిరి పారిపోయారు అంటూ అరిచింది. ఈ దాడిలో గాయపడిన వీరిద్దరినీ స్థానికులు హస్పిటల్ కు తరలించారు. సమాచారమందుకున్న పోలీసులు హస్పిటల్ కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా.. యువతికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. విచారణలో పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా.. ఎక్కడా బయటి వ్యక్తులు యాసిడ్ దాడి చేసిన ఆనవాళ్లు కన్పించలేదు. దీంతో పోలీసులు బాధితుడిని మరోసారి ప్రశ్నించారు. అయితే బైక్పై ఉండగా.. తనను హెల్మెట్ తీయమని యువతి చెప్పిందని, ఆ తర్వాతే దాడి జరిగిందని ఆ యువకుడు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు యువతిని ప్రశ్నించగా..నిజం ఒప్పుకోవడంతో ఆమెను అరెస్టు చేశారు.