సౌరవ్కు సిల్వర్, ఆంటిమ్కు బ్రాంజ్
హాంగ్జౌ: ఆసియా గేమ్స్లో ఇండియన్ ఆర్చర్ల గురి మళ్లీ అదిరింది. మెన్స్, విమెన్స్ కాంపౌండ్ టీమ్స్ గోల్డ్ మెడల్స్తో డబుల్ ట్రీట్ ఇచ్చాయి. గురువారం జరిగిన విమెన్స్ ఫైనల్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ వెన్నం–అదితి సవానీ–పర్నిత్ కౌర్తో కూడిన ఇండియా త్రయం 230–229తో చెన్ యి సువాన్–హుయాంగ్ జో–వాంగ్ లు యన్ (చైనీస్తైపీ)పై గెలిచింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన గోల్డ్ మెడల్ మ్యాచ్లో ఇండియన్ ఆర్చర్లు అద్భుతమైన గురితో 60/60 పాయింట్లు సాధించారు. దీంతో ఓ దశలో ఇరుజట్ల స్కోరు 200–200తో సమమైంది. ఫైనల్ సెట్లో అదితి, పర్నిత్ ఆఖరి మూడు బాణాలకు పర్ఫెక్ట్ 10 పాయింట్లు సాధించారు.
చైనీస్తైపీ ఆర్చర్లలో ఒకరు 9 పాయింట్లే నెగ్గడంతో ఒక్క పాయింట్ తేడాతో ఇండియాకు బంగారు పతకం ఖాయమైంది. విజయవాడకు చెందిన జ్యోతికి గేమ్స్లో ఇది రెండో గోల్డ్ మెడల్ కాగా, శనివారం జరిగే కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మరో స్వర్ణం కోసం పోటీపడనుంది. ఇక మధ్యాహ్నం జరిగిన మెన్స్ ఫైనల్లో అభిషేక్ వర్మ–ఒజాస్ దియోతలే–ప్రథమేశ్ జవ్కార్ 235–230తో జూ జియోహున్–యాంగ్ జావున్–కిమ్ జాంగో (సౌత్ కొరియా)పై గెలిచారు. ఓవరాల్గా ఇండియా 86 (21 గోల్డ్, 32 సిల్వర్, 33 బ్రాంజ్) పతకాలతో నాలుగో ప్లేస్లో కొనసాగుతున్నది.
ఆంటిమ్ బ్రాంజ్తో సరి
రెజ్లింగ్ యంగ్ సెన్సేషన్ ఆంటిమ్ ఫంగల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్కే పరిమితమైంది. ప్లే ఆఫ్ బౌట్లో ఆంటిమ్ 3-1తో టోక్యో ఒలింపిక్ మెడలిస్ట్ బోలోర్టుయా బ్యాట్-ఓచిర్ (మంగోలి యా)పై గెలిచింది. క్వార్టర్ఫైనల్లో అకారి ఫుజినామి (జపాన్) చేతిలో ఓడిన ఆంటిమ్ బ్రాంజ్ బౌట్లో అటాకింగ్ గేమ్తో ఆకట్టు కుంది. ఇతర మెడల్ బౌట్స్లో నరీందర్ చీమా (97 కేజీ), నవీన్ (130 కేజీ), పూజా గెహ్లాట్ (50 కేజీ) ఆకట్టుకోలేకపోయారు. పూజా 2–9తో అటెంజీ కునిమజేవా చేతిలో ఓడింది. విమెన్స్ 57 కేజీల్లో మాన్సి అహ్లవత్ బై ఫాల్ ద్వారా లయోలోకిహన్ సొబిరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో కంగుతిన్నది. బజ్రంగ్ పూనియా (65 కేజీ) శుక్రవారం బరిలోకి దిగనున్నాడు.
గోల్డెన్ దీపిక
స్క్వాష్లో ఇండియాకు ఒక గోల్డ్, సిల్వర్ మెడల్ లభించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో దీపికా పల్లికల్–హరీందర్ సింగ్ జోడీ 11–10, 11–0తో ఐఫా బింటి అజ్మన్–మహ్మద్ సయాఫిక్ బిన్ మహ్మద్ కమల్ (మలేసియా)పై గెలిచి స్వర్ణం కైవసం చేసుకున్నారు. స్క్వాష్లో ఇండియాకు ఇది రెండో గోల్డ్ మెడల్. 35 నిమిషాల మ్యాచ్లో ఇరుజట్లు ప్రతి పాయింట్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో తొలి గేమ్లో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. ఆఖర్లో దీపిక కొట్టిన ఫోర్హ్యాండ్కు పాయింట్ రావడంతో తొలి గేమ్ ఇండియా సొంతమైంది.
రెండో గేమ్లో 9–3 ఆధిక్యంతో ఉన్న ఇండియన్ జంటను మలేసియన్లు అడ్డుకున్నారు. వరుసగా ఏడు పాయింట్లు గెలిచి 10--–9 లీడ్లోకి వచ్చారు. ఈ టైమ్లో హరీందర్ రెండు బ్యాక్హ్యాండ్ విన్నర్లు కొట్టి గేమ్, గోల్డ్ మెడల్ను సాధించాడు. మెన్స్ సింగిల్స్ ఫైనల్లో సౌరవ్ ఘోశల్ 11–9, 9–11, 5–11, 7–11తో ఇయాన్ యు ఎంగ్ (మలేసియా) చేతిలో ఓడి రెండో ప్లేస్తో సిల్వర్కు పరిమితమయ్యాడు. గంటపాటు సాగిన మ్యాచ్లో ఇండియన్ ప్లేయర్లు గట్టి పోటీ ఇచ్చినా మలేసియన్ అనుభవం ముందు నిలవలేకపోయాడు.
సింధు ఔట్
భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఆసియా గేమ్స్లో నిరాశపర్చింది. గురువారం జరిగిన విమెన్స్ క్వార్టర్ఫైనల్లో సింధు 16–21, 12–21తో వరల్డ్ ఐదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడింది. 2014, 2018లో వరుసగా బ్రాంజ్, సిల్వర్ మెడల్ను నెగ్గిన సింధు ఈసారి ఖాళీ చేతులతోనే వస్తున్నది. మెన్స్ క్వార్టర్ఫైనల్లో హెచ్.ఎస్. ప్రణయ్ 21–16, 21–23, 22–20తో లీ జి జియా (మలేసియా)పై చెమటోడ్చి నెగ్గి సెమీస్లోకి అడుగుపెట్టాడు. లోయర్ బ్యాక్ పెయిన్ ఇబ్బందిపెట్టినా ప్రణయ్ విజయాన్ని అడ్డుకోలేకపోయింది. డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి 21–7, 21–9 జూ జియి–జొహన్ ప్రజోగో (సింగపూర్)పై గెలిచి సెమీస్లోకి ప్రవేశించారు.