జాతి నిర్మాణానికి మహిళా సాధికారతే కీలకం: మంత్రి పొన్నం ప్రభాకర్

జాతి నిర్మాణానికి మహిళా సాధికారతే కీలకం: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు: అభివృద్ధి చెందిన సమాజం కావాలన్నా, జాతి నిర్మాణం జరగాలన్నా మహిళా సాధికారత అవసరమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పురుషులు పూర్తిగా సాధికారత సాధించినా.. ఆ అభివృద్ధి సగం మాత్రమే అవుతుందని, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ తొలి సంతకం చేసినట్టు గుర్తుచేశారు.

ఆదివారం హైదరాబాద్‌‌లోని స్టాన్లీ మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో ఆలిడిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్(ఐఫీయా), తెలంగాణ స్టేట్ టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ఆధ్వర్యంలో ‘మహిళా సాధికారత.. లింగ సమానత్వం’అనే అంశంపై నేషనల్ సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై, మాట్లాడారు. టీచర్ల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పదేండ్లుగా పెండింగ్‌‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ చేపట్టామని తెలిపారు. త్వరలోనే ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. ఆకాశంలో సగం-.. అవనిలో సగం అని ఎంత చెప్పుకున్నా ఇంకా మహిళా సాధికారత పూర్తి కాలేదన్నారు.

మహిళలే నిర్ణయాత్మక శక్తి కావాలి

అన్ని రంగాల్లో నిర్ణయాత్మక శక్తి మహిళలే కావాలని, అప్పుడు మాత్రమే అభివృద్ధి చెందిన సమసమాజం ఏర్పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ తెలిపారు. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో బడుల్లో మౌలిక వసతుల కల్పనలో  మహిళలను సంపూర్ణ భాగస్వామి చేసినట్టు తెలిపారు.

 విద్యతో తారతమ్యాలు తగ్గించడం ద్వారా మహిళా సాధికారత సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, ప్రొఫెసర్ వై.ప్రశాంతి, ఐఫియా ప్రెసిడెంట్ సుధీకర్ కుమార్, ప్రధాన కార్యదర్శి నబ్ కుమార్ కర్మకార్, స్టాన్లీ కాలేజీ చైర్మన్ కృష్ణారావు, టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కటకం రమేశ్‌‌, మారెడ్డి అంజిరెడ్డి, అశోక్ కుమార్, సుబ్బారెడ్డి, కిరణ్ జ్యోతి, స్వర్ణసమత తదితరులు పాల్గొన్నారు.