ఫిబ్రవరి 23 నుంచి డబ్ల్యూపీఎల్.. పూర్తి వివరాలు ప్రకటించిన బీసీసీఐ

ఫిబ్రవరి 23 నుంచి డబ్ల్యూపీఎల్.. పూర్తి వివరాలు ప్రకటించిన బీసీసీఐ

ఐపీఎల్ కు ముందు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో ఎడిషన్ ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 17 వరకు జరుగుతుందని తాజాగా వెల్లడించింది. సీజన్ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడతాయి. ఫిబ్రవరి 23న బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ ఓపెనింగ్ మ్యాచ్ జరుగుతుంది.

ఈ సీజన్ మొత్తం మ్యాచ్ లను బెంగళూరు, ఢిల్లీలో జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మార్చ్ 15 న ఎలిమినేటర్ మ్యాచ్ .. మార్చ్ 17 న ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి.  WPL లో మొత్తం 22 మ్యాచులు జరుగుతాయి. మొత్తం 5 జట్లు ఈ టోర్నీలో తలపడతాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో , ముంబై ఇండియన్స్ ఫైనల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ప్రారంభ WPLలో విజేతగా నిలిచింది.
     
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు టైటిల్ కోసం పోటీ పడతాయి. గత సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ మెగ్ లానింగ్ 345 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన హేలీ మాథ్యూస్ 10 మ్యాచ్‌లలో 16 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను గెలుచుకుంది.