హైదరాబాద్ సిటీ, వెలుగు: చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలోని నిర్మాణ దశలో ఉన్న పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. గురువారం వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనుంజయతో కలిసి హాస్టల్ బ్లాక్, అకడమిక్ బ్లాక్, ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్, వీసీ రూమ్, హాస్టల్ నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. వర్సిటీ 39 ఎకరాల 6 గుంటలు ఉండగా మూడెకరాల విస్తీర్ణంలో పనులు కొనసాగుతున్నాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం రూ.540 కోట్లు ఖర్చు పెడుతోందన్నారు. 24 గంటల పాటు షిఫ్టుల వారీగా నిర్వహించాలన్నారు.
ప్రాజెక్టు పూర్తయితే అకడమిక్ బ్లాక్లో 4,488 మంది స్టూడెంట్స్, హాస్టల్ బ్లాక్లో 1,726 మంది స్టూడెంట్స్కు వసతి కల్పించవచ్చన్నారు. కిచెన్ అండ్ డైనింగ్ కాంప్లెక్స్లో ఒకేసారి 1,212 మందికి భోజన చేయవచ్చని, ఆడిటోరియంలో 1,250 మంది కూర్చునే సామర్థ్యం ఉంటుందన్నారు. అనంతరం స్టూడెంట్స్తో మాట్లాడి వారితో కలిసి భోజనం చేశారు. టీజీఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనితా సింగ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుభాష్, నాంపల్లి తహసీల్దార్ నయీముద్దీన్, బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రాజెక్ట్ ఇంజినీర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
