న్యూఢిల్లీ: హోల్సేల్ ధరల పెరుగుదలను కొలిచే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) ఈ ఏడాది మే నెల 9.68 శాతానికి పెరిగింది. ఏప్రిల్లో 8.26 శాతంగా ఉంది. ధరల హెచ్చుతగ్గులను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి ప్రభుత్వం మొదటిసారిగా వస్తువులు, సేవల రంగానికి సంబంధించిన ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ (పీపీఐ) గణాంకాలను కూడా విడుదల చేసింది.
ఏప్రిల్లో 8.1 శాతంగా నమోదైన పీపీఐ, మే నెలలో 9.4 శాతానికి చేరింది. డబ్ల్యూపీఐ, పీపీఐ రెండింటికీ 2022–23ను బేస్ ఇయర్గా తీసుకున్నారు. ఇందులో మొత్తం 957 వస్తువులను చేర్చారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) సిఫార్సుల మేరకు, రాబోయే ఐదేళ్లలో ప్రస్తుతం ఉన్న హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ స్థానంలో పూర్తిగా పీపీఐని ప్రవేశపెట్టనున్నారు.
ఔట్పుట్ పీపీఐ (వస్తువుల) లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అత్యధికంగా 69.93శాతం వెయిటేజ్ ఉంది. వ్యవసాయ రంగానికి 22.16శాతం, విద్యుత్కు 4.49శాతం, మైనింగ్కు 3.42శాతం కేటాయించారు. సేవల రంగం పీపీఐలో మొదటి దశలో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, టెలికం, రైల్వేలు, విమానయానం, పెన్షన్ ఫండ్స్ వంటి సేవలను చేర్చారు.
