వడోదర: హోరాహోరీ పోరాటాలతో ఫ్యాన్స్ను అలరిస్తున్న విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్ తుది ఘట్టానికి చేరుకుంది. స్మృతి మంధాన కెప్టెన్సీలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), జెమీమా రోడ్రిగ్స్ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) గురువారం జరిగే టైటిల్ ఫైట్కు రెడీ అయ్యాయి.
ప్రాణ స్నేహితులైన స్మృతి, జెమీమా కెప్టెన్లుగా తలపడుతుండటం ఈ ఫైనల్ ఫైట్ మరింత మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత మూడు సీజన్లలో తుది మెట్టుపై బోల్తా పడ్డ ఢిల్లీ నాలుగో ప్రయత్నంలో అయినా కప్పు కలను నెరవేర్చుకోవాలని పట్టుదలగా ఉండగా.. రెండుసార్లు విజేతగా నిలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేయాలని ఆర్సీబీ భావిస్తోంది.
లీగ్ దశలో వరుసగా ఐదు విజయాలతో అదరగొట్టిన స్మృతి మంధాన సేన నేరుగా ఫైనల్కు చేరగా .. ఎలిమినేటర్లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసిన డీసీ ఫుల్ కాన్ఫిడెన్స్తో తుదిపోరుకు వచ్చింది. గతేడాది ఫైనల్లో ఆర్సీబీ చేతిలోనే ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు కసిగా ఉంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఫామ్లో ఉండటంతో పోరు రసవత్తరంగా సాగనుంది.
ఆర్సీబీ బ్యాటింగ్లో మంధాన, గ్రేస్ హారిస్, రిచా ఘోశ్.. బౌలింగ్లో నాడిన్ డి క్లెర్క్, సయాలీ సత్ఘారే బలంగా కనిపిస్తున్నారు. ఢిల్లీ తరపున షెఫాలీ వర్మ, లారా వోల్వార్ట్, లిజెల్లీ లీ, అద్భుతంగా ఆడుతున్నారు. గత పోరులో జెమీమా ఫామ్లోకి వచ్చింది. బౌలింగ్లో ఆ టీమ్ మరింత బలంగా ఉంది. పేసర్లు చినెల్లీ హెన్రీ, నందిని శర్మ కొత్త బాల్తో అదరగొడుతున్నారు.
