టార్గెట్​ను మించి ధాన్యం కొనుగోళ్లు

టార్గెట్​ను మించి ధాన్యం కొనుగోళ్లు
  • యాసంగి లక్ష్యం 70.17 లక్షల టన్నులు
  • ఇప్పటి దాకా 71 లక్షల టన్నుల వడ్ల సేకరణ
  • 12 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు
  • ఇప్పటికే రూ.15వేల కోట్లు చెల్లింపు
  • ధాన్యం సేకరణలో నిజామాబాద్ టాప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈయేడు టార్గెట్ ను మించి కొనుగోళ్లు జరుగుతున్నాయి. యాసంగిలో 70.17 లక్షల టన్నుల వడ్లు కొనాలని సివిల్ సప్లయ్స్ శాఖ టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికే 71 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తి కావొచ్చాయి. లేట్​గా సాగైన కొన్ని జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే వడ్లు ఉన్నాయి.

సన్న వడ్లకు మద్దతు ధరపై అదనంగా బోనస్ ప్రకటించిన నేపథ్యంలో రైతులు వడ్లను ప్రైవేటు వ్యాపారులకు అమ్మకుండా సెంటర్లకే తీసుకొస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకు యాసంగి కొనుగోళ్లు పూర్తయ్యే అవకాశం ఉందని సివిల్ సప్లయ్స్ అధికారులు చెప్తున్నారు.

కాగా, ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్ జిల్లా టాప్​లో నిలిచింది. ఈ ఒక్క జిల్లాలోనే 8.21 లక్షల టన్నులకు పైగా వడ్లు సేకరించారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 6 లక్షల టన్నులు, జగిత్యాల జిల్లాలో 4.50 లక్షల టన్నులు, కామారెడ్డిలో 3.77 లక్షల టన్నులు, పెద్దపల్లి జిల్లాలో 3.73 లక్షల టన్నులు, యాదాద్రి జిల్లాలో 3.50 లక్షల టన్నులు, సిద్దిపేట జిల్లాలో 3.50 లక్షల టన్నులు, సూర్యాపేట జిల్లాలో 3.20 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేశారు.

సెంటర్ల వైపే మొగ్గు చూపిన రైతులు

రాష్ట్ర వ్యాప్తంగా 69 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 8,379 కొనుగోలు సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. ఇప్పటి వరకు 12 లక్షల మంది రైతుల నుంచి 71 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. ఇప్పటిదాకా కొన్న వడ్లలో 22 లక్షల టన్నులు సన్నాలు ఉన్నాయి. 49 లక్షల టన్నుల దొడ్డు రకం ఉన్నాయి. వడ్లను 1,950 మిల్లులకు అలాట్ చేశారు. సన్న బియ్యాన్ని స్టేట్ పూల్ ద్వారా.. దొడ్డు బియ్యాన్ని ఎఫ్​సీఐకి కేటాయించేలా మిల్లులకు కేటాయించారు.

రూ.16,500 కోట్ల విలువైన వడ్లను సివిల్ సప్లయ్స్ శాఖ కొనుగోలు చేసింది. ఇందులో ఇప్పటికే రూ.15,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. 2022–23 యాసంగిలో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఇదే టైం నాటికి 50 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయగా.. ఈయేడు ఇదే తేదీ నాటికి 71 లక్షల టన్నులు కొన్నారు. అప్పుడు రూ.4 వేల కోట్లు చెల్లించగా.. ఇప్పుడు రూ.15వేల కోట్లు పే చేశారు.