కన్వరియాల(శివభక్తుల)పై దాడి చేస్తే పోలీసు తూటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బాదార్పూర్ ఏరియాలో యోగి ఈ కామెంట్స్ చేశారు. కన్వర్ యాత్రలో భాగంగా కాలినడకన వెళుతున్న కన్వరియాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని ప్రస్తావిస్తూ.. వారిపై దాడులు చేయొద్దని హెచ్చరించారు. మాటలతో వినకుంటే తూటాలకు పనిచెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. చట్టానికి లోబడి ఎవరైనా సరే తమ తమ పండుగలను వేడుకగా జరుపుకోవచ్చని యోగి అన్నారు. కానీ శివభక్తులపై చేయివేసినా, అల్లర్లకు పాల్పడాలని చూసినా ఊరుకునేది లేదని తేల్చిచెప్పారు. ప్రజల సాధారణ జీవితాన్ని అస్తవ్యస్తంగా మార్చేందుకే షాహీన్ బాగ్ లో కొంతమందినిరసనలు జరుగుతున్నాయని యోగి ఆరోపించారు. షాహీన్ బాగ్ ప్రొటెస్టర్ల అసలు ఉద్దేశం ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం, రామజన్మభూమిపై కోర్టు తీర్పును వ్యతిరేకించడమేనని ఆయన వివరించారు. జమ్మూకాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తే పాకిస్తాన్తోపాటు కేజ్రీవాల్ కూడా బాధపడ్డారని ఆరోపించారు. షాహీన్బాగ్నిరసనలు.. శాంతి, సాధారణ జీవితాన్ని భంగపరిచేందుకు చేస్తున్న హానికరమైన ప్రయత్నాలని మండిపడ్డారు. ఒకవైపు అభివృద్ధి, నేషనలిజం కోసం నరేంద్ర మోడీ నాయకత్వానికి, మరోవైపు విభజన శక్తులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్, కేజ్రీవాల్కు మధ్య ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.
యోగిపై ఈసీకి ఆప్ లెటర్
ఢిల్లీలోని షాహీన్బాగ్లో జరుగుతున్న ప్రొటెస్టులపై రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ను ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా బ్యాన్ విధించాలని విజ్ఞప్తి చేసింది. యోగిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.