యూపీ తదుపరి సీఎం కూడా యోగి ఆదిత్యనాథే!

యూపీ తదుపరి సీఎం కూడా యోగి ఆదిత్యనాథే!

లక్నో: వచ్చే ఏడాది ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే అధికార, విపక్షాలు ఎన్నికల కార్యాచరణను రూపొందిస్తున్నాయి. పార్టీలు, నేతలు ఒకరిపై మరొకరు కామెంట్లు చేస్తూ విమర్శల పర్వానికి తెరదీశారు. ఈ క్రమంలో ఏయే పార్టీ తరఫున ఎవరు సీఎం అభ్యర్థిగా ఉంటారనేది కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. బీజేపీ తరఫున ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తిరిగి పదవి రేసులో ఉంటారని సమాచారం. ఈ విషయంపై యూపీ బీజేపీ నేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. యోగి నేతృత్వంలో తమ ప్రభుత్వం బాగా పని చేస్తోందని కేశవ ప్రసాద్ అన్నారు. 

‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో 2017 నుంచి మా సర్కారు అద్భుతంగా ముందుకెళ్తోంది.  యోగి పనితీరు, నాయకత్వ పటిమ చాలా అద్భుతం. వచ్చే ఎన్నికల్లోనూ పార్టీని ఆయనే ముందుండి నడిపించాలని అనుకుంటున్నా. ఉత్తర ప్రదేశ్‌లో మా పార్టీలో ప్రముఖ వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ అనే చెప్పాలి. అయితే మా నేత ఎవరనే విషయాన్ని పార్టీ అధిష్టానమే నిర్ణయిస్తుంది’ అని కేశవ్ ప్రసాద్ పేర్కొన్నారు.