రాయ్పుర్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. కివీస్ బౌలర్ లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ లో కెప్టెన్ రోహిత్శర్మ సిక్సర్ కొట్టగా వెంటనే ఓ బాలుడు అకస్మాత్తుగా మైదానంలోకి దూసుకువచ్చి హిట్మ్యాన్ను కౌగిలించుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ బాలుడిని బలవంతంగా బయటకు తీసుకెళ్తుండగా అతన్ని వదిలేయాలని రోహిత్ సిబ్బందికి సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాయ్పుర్ వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి భారత్ బౌలింగ్ ఎంచకుంది. భారత బౌలర్ల ధాటికి కివీస్ 108 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు సాధించగా గ్లెన్ ఫిలిప్స్ (36) టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం భారత్ రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ను చేధించింది. రోహిత్ శర్మ (51), గిల్ (40) పరుగులతో రాణించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ని భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే జనవరి 24 న జరగనుంది.