
జీడిమెట్ల, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ యువకుడిని కత్తులతో పొడిచి చంపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సూరారం ఏరియాకు చెందిన అజమ్ సయ్యద్, అప్సానా దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు డానిష్(27) ఉన్నాడు. దంపతులు విబేధాలతో విడిపోయారు.
అప్సానా జగద్గిరిగుట్టలో ఉంటూ తన ముగ్గురి పిల్లలకు పెండ్లిళ్లు చేసింది. డానిష్ బోరబండలో ఉంటూ క్యాబ్ నడుపుతున్నాడు. ఒంటరిగా ఉంటున్న అప్సానాతో జగద్గిరిగుట్టకు చెందిన బిలాల్(30) వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిపై డానిష్కు అనుమానం రావడంతో బిలాల్ను పలుమార్లు డానిష్ హెచ్చరించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకునేందుకు బిలాల్ నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్ అస్లాంతో కలిసి మర్డర్ కు ప్లాన్ చేశాడు.
డానిష్ను మాట్లాడుకుందామని చెప్పి గాజుల రామారం చింతల్ చెరువు వద్దకు గురువారం రాత్రి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ అర్ధరాత్రి వరకు మద్యం తాగారు. ఆ తర్వాత బిలాల్, అస్లాం కలిసి డానిష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.