వివాహేతర సంబంధానికిఅడ్డొస్తున్నాడని యువకుడి హత్య..పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు!

వివాహేతర సంబంధానికిఅడ్డొస్తున్నాడని యువకుడి హత్య..పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు!
జీడిమెట్ల, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ యువకుడిని  కత్తులతో పొడిచి చంపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ సూరారం ఏరియాకు చెందిన  అజమ్​ సయ్యద్, అప్సానా దంపతులకు  ఇద్దరు ఆడపిల్లలు, కొడుకు డానిష్​(27) ఉన్నాడు. దంపతులు విబేధాలతో విడిపోయారు.  

అప్సానా జగద్గిరిగుట్టలో ఉంటూ తన ముగ్గురి పిల్లలకు పెండ్లిళ్లు చేసింది.  డానిష్ బోరబండలో ఉంటూ క్యాబ్ నడుపుతున్నాడు.  ఒంటరిగా ఉంటున్న అప్సానాతో జగద్గిరిగుట్టకు చెందిన బిలాల్(30)​ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిపై డానిష్​కు అనుమానం  రావడంతో  బిలాల్​ను పలుమార్లు డానిష్ హెచ్చరించాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకునేందుకు  బిలాల్ నిర్ణయించుకున్నాడు. తన ఫ్రెండ్  అస్లాంతో కలిసి మర్డర్ కు ప్లాన్ చేశాడు. 

 డానిష్​ను మాట్లాడుకుందామని చెప్పి గాజుల రామారం చింతల్ చెరువు వద్దకు గురువారం  రాత్రి తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురూ అర్ధరాత్రి వరకు మద్యం తాగారు.  ఆ తర్వాత బిలాల్, అస్లాం కలిసి డానిష్ పై   కత్తులతో  దాడి చేసి పొడిచి చంపేశారు.   ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను  పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.