అబ్దుల్లాపూర్ మెట్ లో ఘటన
ఎల్ బీ నగర్,వెలుగు: కుక్క విషయంలో గొడవ జరిగ్గా మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో ఉండే దేశగోని వంశీ(24) వ్యాపారం చేస్తున్నాడు. వంశీ ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన ఇంటి ముందు నిలబడి ఉన్నాడు. అదే సమయంలో అతడి ఇంటి దగ్గరలో ఉండే జానీ తన కుక్కను తీసుకుని బయటకి వచ్చాడు. ఆ కుక్క వంశీ ఇంటి ముందు మూత్రం పోసింది. ఈ విషయంలో వంశీ, జానీ మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ విషయపై తాను పెద్దల సమక్షంలో మాట్లాడతానని జానీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వంశీ కూడా ఇంట్లోకి వెళ్లాడు. సోమవారం ఉదయం వంశీ తండ్రి రఘుపతి అతడి రూమ్ డోర్ కొట్టినా స్పందన లేదు. అనుమానం వచ్చి రఘుపతి డోర్ పగులగొట్టి చూడగా..వంశీ చీరతో ఫ్యాన్ కి ఉరేసుకుని కనిపించాడు. వంశీ డెడ్ బాడీని కిందకి దించి రఘుపతి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వంశీ ఆత్మహత్యకు రాత్రి జరిగిన గొడవ కారణమా లేదా వేరే కారణాలున్నాయా అనే కోణంలో విచారిస్తున్నామని..పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.