వేములవాడ, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్ ఏరియాలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో ఓ యువకుడు బుధవారం అనుమానస్పద స్థితిలో చనిపోయాడు. స్థానికులు, లాడ్జి నిర్వాహకుల వివరాల ప్రకారం.. పట్టణంలోని సిద్దార్థ లాడ్జిలోకి మాట్లాడుకునేది ఉందని ఓ యువకుడు(30), ఓ యువతి(20) రూంలోకి వెళ్లారు. కాసేపటికి మరో వృద్ధుడు సైతం గదిలోకి వెళ్లాడు. అనంతరం వారిద్దరూ ఆందోళనగా బయటకు వచ్చారు. గమనించిన లాడ్జి నిర్వాహకులు గదిలోకి వెళ్లి చూడగా యువకుడు చనిపోయి ఉన్నాడు.
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. చనిపోయిన యువకుడు వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భుక్య మోహన్ (30) గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ వీరప్రసాద తెలిపారు
