- ఢిల్లీలో అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతున్న మురళి
పాపన్నపేట, వెలుగు : క్రికెట్ బెట్టింగ్ పెట్టి తీవ్రంగా నష్టపోయిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లి తండాకు చెందిన ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పొడ్చన్ పల్లి తండాకు చెందిన మోహన్, బుజ్జిల కొడుకు మురళి (20) ఢిల్లీలో అగ్రికల్చర్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ చదివేటప్పటి నుంచే క్రికెట్ బెట్టింగ్ అలవాటు ఉంది. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లిన తరువాత కూడా పెద్ద మొత్తంలో బెట్టింగ్ పెట్టేవాడు. చదువు కోసమని మురళి అడిగినప్పుడల్లా తండ్రి డబ్బులు పంపేవాడు.
ఇలా గడిచిన ఐదేండ్లలో మురళి దాదాపు రూ.15 లక్షల వరకు బెట్టింగ్ లో కోల్పోయాడు. డబ్బులు పోవడమే కానీ రాకపోవడంతో మనస్తాపం చెందాడు. వారం కింద ఢిల్లీ నుంచి పొడ్చన్ పల్లి తండాకు వచ్చాడు. అప్పటినుంచి దిగాలుగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మురళి గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పాపన్నపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.