అనుమానాస్పద స్ధితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్ధితిలో యువకుడి మృతి

తన కొడుకును  చంపేశారంటున్న మృతుడి తండ్రి
 ప్రియురాలి ఇంటి ముందు డెడ్ బాడీతో ఆందోళన

చండ్రుగొండ, వెలుగు: అనుమానాస్పద స్థితిలో యువకుడు చనిపోయిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చండ్రుగొండ మండలంలో జరిగింది. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య తండా అనుబంధ గ్రామమైన కరిశలబోడు తండాకు చెందిన బోడా వినోద్ కుమార్(23), అదే ఊళ్లోని యువతి మూడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ వ్యవహారం ఇద్దరి ఇండ్లలో తెలియడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. గ్రామంలోని కులపెద్దలు పంచాయితీలు పెట్టి సర్దిచెప్పారు. కాగా గురువారం తెల్లవారు జామున ఇంటి నుంచి బయటికి వెళ్లిన వినోద్ కుమార్ గ్రామ శివారులో చనిపోయి పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులకి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన కొడుకును యువతి కుటుంబమే చంపిందంటూ వినోద్​తండ్రి బోడా సక్రాం ఆరోపించాడు. డెడ్​బాడీతో యువతి ఇంటి మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించారు. జూలూరుపాడు సీఐ నాగరాజు వచ్చి డెడ్​బాడీని పోస్టుమార్టం కోసం కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. సక్రాం ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కింద కేసు ఫైల్​చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేశ్ కుమార్ తెలిపారు.