
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొనుగోలు బిడ్ విషయంలో సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. తినడానికి తిండి లేదు కానీ సోకులకు లోటా అన్నట్లు విశాఖ ఉక్కు కొంటానని, ఇప్పుడు పది మందిలో రాష్ట్ర పరువు తీశాడని ధ్వజమెత్తారు. కేసీఆర్ గొప్పలకు పోయి బొక్కబోర్లపడ్డడని ఎద్దేవా చేశారు. కపట ప్రేమలు కురిపించి, హెచ్చులకు పోయి నవ్వుల పాలయ్యారని వ్యాఖ్యానించారు. బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ అని కేసీఆర్ నిరూపించుకున్నారని అన్నారు.. అయినా అడ్డంపొడుగు మాటలతో జనాలను ఫూల్స్ చేయడం దొరకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. అనువుగాని చోట అధికులమన రాదు అనే సామెత పగటెచ్చుల దొర కేసీఆర్ కు సరిగ్గా సరిపోతుందన్నారు షర్మిల.
కేసీఆర్ నిజంగా తెలంగాణ బిడ్డనే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యం అనుకుంటే... గతంలో హామీ ఇచ్చినట్లుగా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలని సవాల్ విసిరారు. 100 రోజుల్లో నిజాం షుగర్స్ తెరిపిస్తా అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. మూతపడిన వందలాది ఫ్యాక్టరీలను తెరిపించి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టి రోడ్డున పడ్డ లక్షలాది కార్మికులను ఆదుకోవాలన్నారు. కేసీఆర్ తన నీచ రాజకీయాల కోసం ప్రతీసారి రాష్ట్ర పరువును పణంగా పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు షర్మిల.
మరో వైపు T-SAVE ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద అఖిలపక్షం తలపెట్టిన దీక్షకు హైకోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామమన్నారు షర్మిల. నియంత కేసీఆర్ ప్రశ్నించే గొంతుకల్ని అణగదొక్కాలని చూసినా న్యాయం బతికే ఉందనడానికి ఈ తీర్పు నిదర్శనమన్నారు. దీక్షా తేదీని త్వరలోనే వెల్లడిస్తామని.1.91లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు పోరాడుతామని చెప్పారు.