గత వారం లడఖ్లో చైనా సైన్యం 20 మంది భారత సైనికులను హతమార్చినందుకు నిరసనగా కోల్కతాలోని జోమాటో ఉద్యోగులు కంపెనీ టీషర్టులను కాల్చివేశారు. బెహాలాలో జరిగిన ఈ నిరసన సందర్భంగా.. జోమాటోలో చైనా పెట్టుబడి గణనీయంగా ఉన్నందున కొంతమంది తమ ఉద్యోగాన్ని కూడా వదిలేశారని నిరసనకారులు తెలిపారు. అయితే మేం నిరసన మాత్రమే తెలుపుతున్నామని.. ఫుడ్ డెలివరీ మాత్రం ఆపమని తెలియజేశారు.
‘చైనా కంపెనీలు మన దగ్గర నుంచి లాభం పొంది.. మన దేశ సైన్యంపైనే దాడి చేస్తున్నాయి. చైనా మన దేశ భూభాగాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిని మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం’అని ఒక నిరసనకారుడు తెలిపాడు. ‘మేం ఆకాలితో అయినా ఉంటాం కానీ.. చైనా పెట్టుబడులున్న సంస్థలలో పనిచేయడానికి సిద్ధంగా లేము’ అని మరోకరు అన్నారు.
కరోనావైరస్ కారణంగా మే నెలలో జోమాటో 520 మంది ఉద్యోగులను తొలగించింది. అయితే నిరసనకారులలో ఉద్యోగులు ఉన్నారో లేక ఉద్యోగం నుంచి తొలగించబడిన వారున్నారో స్పష్టంగా తెలియలేదు. అలీబాబాకు చెందిన యాంట్ ఫైనాన్షియల్ 14.7 శాతం వాటా కోసం జోమాటోలో 210 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఇటీవల కూడా జోమాటో.. యాంట్ ఫైనాన్షియల్ నుండి అదనంగా 150 మిలియన్ డాలర్లు సేకరించారు.
జూన్ 15న తూర్పు లడఖ్లోని గాల్వన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో కల్నల్ సహా ఇరవై మంది భారతీయ ఆర్మీ సిబ్బంది మరణించారు. దాంతో దేశవ్యాప్తంగా చైనాకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి.
For More News..