- నిర్వహణ ఖర్చులు, జీత భత్యాలు, స్కీమ్స్కు మరో రూ.180 కోట్లు
- రూ.530 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
హైదరాబాద్, వెలుగు: రాబోయే గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయశాఖ సన్నద్ధమవుతోంది.మొత్తం రూ. 530 కోట్లతో ప్రభుత్వానికి ప్రపోజల్స్ పంపింది.2027లో జరిగే పుష్కరాలకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది. దీనికి రానున్న 2026–27 బడ్జెట్లో కేటాయింపులపై భారీ అంచనాలతో కూడిన రిపోర్ట్ తయారు చేసింది.
ప్రధానంగా గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్ల కోసమే రూ.350 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అలాగే, శాఖలోని అర్చకులు, ఉద్యోగుల జీతభత్యాలు, ధూపదీప నైవేద్యాల స్కీమ్ (డీడీఎన్ఎస్), కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నిర్వహణకు మరో రూ.180 కోట్లు అవసరమని పేర్కొంది.
ఈ నిధులతో గోదావరి తీరంలోని బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన క్షేత్రాలతోపాటు చిన్న ఆలయాల వద్ద స్నానపు ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ రెగ్యులర్ నిర్వహణ కోసం రూ. 180 నుంచి రూ.200 కోట్ల వరకు ప్రతిపాదించినట్లు తెలిసింది. గత బడ్జెట్ లో సుమారు రూ.175 కోట్లకుపైగా కేటాయించగా.. రూ.50 కోట్ల వరకు రిలీజ్ చేసినట్లు సమాచారం.
కాగా, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుందని దేవాదాయశాఖ ఆశలు పెట్టుకుంది. సాధారణంగా బడ్జెట్లో దేవాదాయ శాఖకు అరకొర నిధులే దక్కుతుంటాయి. కానీ, గోదావరి పుష్కరాలు సెంటిమెంట్ కావడంతో ప్రభుత్వం ఈసారి కోరినంత ఇచ్చే ఛాన్స్ ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. 2027 ఆరంభంలోనే పనులు మొదలుపెట్టాలంటే ఈ బడ్జెట్లోనే నిధులు సాంక్షన్ అవ్వడం కంపల్సరీ అని ఓ సీనియర్ ఆఫీసర్ పేర్కొన్నారు.
