
హైదరాబాద్, వెలుగు: కిందటి వారంలో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలపై జరిపిన దాడులలో రూ. 800 కోట్ల బ్లాక్మనీ కనుక్కున్నట్లు ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలోని పలు ప్రాంతాలలో ఈ గ్రూప్కార్యకలాపాలపై దాడులు జరిపారు. నవ్య డెవలపర్స్, రాగ మయూరి ఇన్ఫ్రా, స్కంధాన్షి ఇన్ఫ్రా కంపెనీలపై గత వారంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. లెక్కల్లో చూపని రూ. 1.64 కోట్ల క్యాష్ను దాడులలో స్వాధీనం చేసుకున్నట్లు కూడా ఐటీ డిపార్ట్మెంట్ ప్రకటించింది. బ్లాక్మనీ దొరక్కుండా ఉండడానికి ఈ కంపెనీలు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించినట్లు ఐటీ డిపార్ట్మెంట్ తెలిపింది. ట్రాన్సాక్షన్లు పూర్తయ్యాక డేటా ఆటోమేటిక్గా మాయం కావడానికి ఈ సాఫ్ట్వేర్ వినియోగించినట్లు వివరించింది. రిజిస్ట్రేషన్ వాల్యూకి మించిన మొత్తాన్ని ఈ కంపెనీలు కస్టమర్ల నుంచి క్యాష్ రూపంలో తీసుకుంది. ఇలా వచ్చిన బ్లాక్మనీని మళ్లీ కొత్త ప్రాపర్టీలు కొనడానికి, ఇతర ఖర్చులకు వెచ్చించినట్లు ఐటీశాఖ వెల్లడించింది.