
కరోనా అంటుకుంటుందని జనం బుగులు
పరేషాన్ కు కారణమైన ఫీవర్ సర్వే
అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లతో టీమ్లు
ఇంటింటికీ వెళ్లి పల్స్ రేట్, టెంపరేచర్
చెక్ చేస్తున్న సిబ్బంది
టెస్టులు బంద్చేసి సర్వేలు ఎందుకంటున్న పబ్లిక్
సూర్యాపేట/మెదక్, వెలుగు: కరోనా సింప్టమ్స్ ఉన్నాయని ఆస్పత్రులకు పోతే కిట్లు లేవని టెస్టులు చేయకుండా వెనక్కి పంపుతున్న సర్కారు.. కొత్తగా కరోనా పేషెంట్ల గుర్తింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న సర్వేపై విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి అందరి హెల్త్ కండీషన్ను ఆరా తీయడంతోపాటు ఆక్సిమీటర్ తో పల్స్ రేట్, థర్మల్ స్కానర్తో టెంపరేచర్ చెక్ చేస్తున్నారు. అయితే అందరికీ ఒకే ఆక్సిమీటర్ వాడడంపై పబ్లిక్ మండిపడుతున్నారు. దీని వల్ల కరోనా అంటుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రుల్లో టెస్టులు బంజేసి సర్వేలు ఎందుకని మండిపడుతున్నారు.
వెయ్యి మందికి ఒకటే ఆక్సిమీటర్
కరోనా లక్షణాలుఉన్నవారిని గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో గురువారం ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఆఫీసర్లు ప్రారంభించారు. ఇందు కోసం ఆశా కార్యకర్త, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం, మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతి నుంచి ఒకరు ఉండేలా నలుగురితో టీమ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్కు వెయ్యి మందిని కేటాయించారు. వీరంతా ప్రతి ఇంటికీ వెళ్లి ఆయా ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఒక్కో టీమ్కు ఒకే థర్మల్స్కానర్, ఆక్సిమీటర్ ఇచ్చారు. థర్మల్ స్కానర్ తో ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ.. ఒకే ఆక్సిమీటర్ ఇవ్వడంతో దాన్ని అందరి వెళ్లకు పెట్టి పల్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. దీంతో కరోనా మహమ్మారి సోకే ప్రమాదం ఉందని జనం ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శానిటైజర్స్, గ్లౌజెస్ఇవ్వకపోవడంతో సర్వే టీమ్ లోని మెంబర్లు.. తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని భయంభయంగానే డ్యూటీ చేస్తున్నరు.
ఒక్కటే ఆక్సిమీటర్ ఇచ్చారు
లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నం
సూర్యాపేట జిల్లాలోని 475 గ్రామ పంచాయితీల పరిధిలో హెల్త్ సర్వే స్టార్ట్ చేశాం. 688 టీమ్స్ గా 2,752 మంది సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఒక్కో టీమ్కు ఒక్కటే ఆక్సిమీటర్, థర్మల్ స్కానర్ అందజేశాం. గురువారం 43,164 ఇండ్లను సర్వే చేసి 574 మంది లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ట్రీట్మెంట్అందిస్తున్నాం. - కోట చలం, డీఎంహెచ్ఓ, సూర్యాపేట
ఒక్కటే ఆక్సిమీటర్ ఇచ్చారు
సూర్యాపేటలో సర్వే చేసేందుకు మాకు ఒక ఆక్సిమీటర్, ఒక థర్మల్ స్కానర్, మాస్క్ మాత్రమే ఇచ్చారు. రెండ్రోజుల్లో వెయ్యిమందిని సర్వే చేయాలని చెప్పారు. అందరికీ ఒకే ఆక్సిమీటర్ తో టెస్టులు చేయడంపై పబ్లిక్అభ్యంతరం చెబుతున్నారు. - రాణి, ఆశా వర్కర్, సూర్యాపేట
లేనివారికి కరోనా వస్తది..
లక్షణాలు ఉన్నాయని పోయినవాళ్లకు ఆసుపత్రుల్లో టెస్టులు చేస్తలేరు. ఇప్పుడు కరోనా ఉన్నవాళ్లను గుర్తించేందుకు ఇల్లిల్లూ తిరుగుతున్నరు. ఒక్క ఆక్సిమీటర్, థర్మల్ స్కానర్తోనే అందరికీ టెస్టులు చేస్తున్నారు. దీని వల్ల లేనివారికి కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. - సతీశ్, సూర్యాపేట