
వెలుగు స్పోర్ట్స్ డెస్క్: చూస్తుండగానే ఓ స్పోర్ట్ ఇయర్ ముగిసింది. కరోనా వల్ల 2020, 2021లో అనేక పోటీలు రద్దయి, వాయిదా పడగా.. 2022లో క్రీడా రంగం కుదుటపడింది. ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్ క్రికెట్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చాయి. మల్టీ స్పోర్ట్ ఈవెంట్ కామన్వెల్త్ గేమ్స్ ఆకట్టుకున్నాయి. ఖతార్ గడ్డపై జరిగిన ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ ప్రియులకు అంతులేని ఆనందాన్ని పంచడంతో 2022కి ఎండ్కార్డ్ పడింది. ఇప్పుడు క్యాలెండర్ మారగా..కొత్త ఏడాదిలోనూ క్రీడాభిమానులను అలరించేందుకు మరెన్నో మెగా ఈవెంట్స్ ముందున్నాయి. ఇండియాలో ఈ నెలలో మెన్స్ వరల్డ్ కప్ మొదలు.. అక్టోబర్లో వన్డే వరల్డ్ కప్ వరకు చాలా టోర్నీలు రెడీగా ఉన్నాయి. 2023లో జరిగే మెగా ఈవెంట్ల గురించి ఓ లుక్కేద్దామా..!
మెన్స్ హాకీ ప్రపంచ కప్ (జనవరి 13 - 29 ఒడిశా)
ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ నాలుగేళ్లకోసారి నిర్వహించే హాకీ వరల్డ్ కప్ నకు భువనేశ్వర్ (రూర్కెలా) మరోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండియా సహా 26 జట్లు పోటీ పడుతాయి. 1975లో చాంపియన్గా నిలిచిన ఇండియా పూల్–డిలో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్తో కలిసి బరిలో నిలవనుంది. ఈ టోర్నీలో పాకిస్తాన్ రికార్డు స్థాయిలో నాలుగు సార్లు గెలిచింది. 2018లో ఇదే భువనేశ్వర్లో జరిగిన గత టోర్నీలో బెల్జియం విజేతగా నిలిచింది. గత ఎడిషన్లో ఫెయిలైన ఇండియా ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గాలని ఆశిస్తోంది.
విమెన్స్ టీ20 వరల్డ్కప్ (ఫిబ్రవరి 10-26 సౌతాఫ్రికా): విమెన్స్ టీ20 వరల్డ్కప్లో పది జట్లు రెండేసి గ్రూప్ల్లో పాల్గొంటాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మరో నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్లో ఆడుతుంది. రెండు గ్రూప్స్లో టాప్2 జట్లు సెమీస్ చేరుకుంటాయి. రికార్డు స్థాయిలో ఐదుసార్లు విన్నర్ అయిన ఆస్ట్రేలియా గ్రూప్– 1లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్తో పాటు ఉంది. గత టోర్నీ రన్నరప్ ఇండియా.. పాక్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఐర్లాండ్లతో కూడిన గ్రూప్ 2లో ఉంది.
విమెన్స్ ఐపీఎల్ (మార్చి)
పుష్కరకాలంగా క్రికెట్ ఫ్యాన్స్కు ఐపీఎల్ ఇస్తున్న కిక్ అంతాఇంతా కాదు. ఈ సారి ఆ కిక్ డబుల్ కానుంది.ఈ ఏడాది నుంచి విమెన్స్ ఐపీఎల్ కూడా జరగనుంది. ప్రారంభ విమెన్స్ ఐపీఎల్ మార్చి 3 నుంచి 26 వరకు జరిగే అవకాశం ఉంది. షెడ్యూల్, ఫ్రాంచైజీలు, ఫార్మాట్ గురించి ఈ నెలలో పూర్తి క్లారిటీ రావొచ్చు. 2008లో మొదలైన ఐపీఎల్తో ఇండి యానే కాకుండా వరల్డ్ క్రికెట్ రూపు రేఖలు మారాయి. ఇప్పుడు విమెన్స్ లీగ్తో మహిళా క్రికెటర్ల రాత కూడా మారనుంది. దీని తర్వాత మెన్స్ ఐపీఎల్ 16వ సీజన్ స్టార్ట్ అవుతుంది.
డబ్ల్యూటీసీ ఫైనల్ (జూన్, లండన్)
ఐసీసీ ఈవెంట్లలో ఇండియా వన్డే, టీ20, చాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకుంది. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ టైటిల్ మాత్రమే లోటుగా ఉంది. రెండేళ్ల కిందట జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన టీమిండియా ఈసారి టైటిల్పై కన్నేసింది. రెండేళ్ల పాటు సాగేడబ్ల్యూటీసీలో టాప్2లో నిలిచిన జట్లు జూన్లో లండన్ వేదికగా జరిగే ఫైనల్లో తలపడుతాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్ ప్లేస్లో ఉండగా, ఇండియా రెండో స్థానంలో ఉంది. ఫిబ్రవరి–-మార్చిలో ఆసీస్తో సొంతగడ్డపై 4 టెస్టుల సిరీస్లో గెలిస్తే ఇండియా టాప్2లో నిలిచి ఫైనల్ ఆడగలదు.
ఫార్ములా -ఈ రేస్ (ఫిబ్రవరి 11, హైదరాబాద్)
ఫారిన్లో పాపులర్ అయిన ‘ఫార్ములా–ఈ’ రేస్ 2023లో ఇండియాలో అడుగు పెట్టనుంది. ఎలక్ట్రిక్ కార్లతో జరిగే ఈ మెగా రేస్కు ఇండియా తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుండగా అది హైదరాబాద్ జరగబోవడం విశేషం. ఫార్ములా–ఈ 2023 సీజన్లో భాగంగామహీంద్రా కంపెనీకి చెందిన టీమ్సహా 11 జట్లు వివిధ దేశాల్లోని 11 నగరాల్లో 16 రేసుల్లో పోటీ పడతాయి.
ఇందులో నాలుగో రేస్ అయిన ‘హైదరాబాద్– ఈ ప్రి’ ఫిబ్రవరి 11వ తేదీన జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే నెక్లెస్ రోడ్డుపై ప్రత్యేకంగా 2.7 కి.మీ. స్ట్రీట్ సర్క్యూట్ ఏర్పాటు చేశారు. గత నెలలో ఈ సర్క్యూట్పై ఇండియన్ రేసింగ్ లీగ్ నిర్వహించారు. అది ట్రాక్ టెస్టింగ్కు ఉపయోగపడింది.
వన్డే వరల్డ్ కప్ (అక్టోబర్, ఇండియా)
ఈ ఏడాది ఇండియాలో జరగబోయే బిగ్గెస్ట్ స్పోర్టింగ్ఈవెంట్ ఇదే కానుంది. 12 ఏండ్ల గ్లాప్ తర్వాత వన్డే వరల్డ్ కప్కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. మన దేశంలో ఈ టోర్నీ జరగడం ఇది నాలుగో సారి. అక్టోబర్లో జరిగే మెగా ఈవెంట్లో ఇండియా సహా పది జట్లు పోటీపడతాయి. 2019 ఎడిషన్ మాదిరిగా రౌండ్ -రాబిన్, నాకౌట్ దశలో మ్యాచ్లు జరుగుతాయి. చివరగా 2011లో సొంతగడ్డపై కప్పు నెగ్గిన ఇండియా 2015, 2019లో సెమీఫైనల్లోనే వెనుదిరిగింది. ఈ సారి కప్పు నెగ్గేందుకు సొంతగడ్డనే సరైన వేదిక అని భావిస్తోంది. ఏజ్ దృష్ట్యా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహ్మద్ షమీ తదితరులకు ఇదే చివరి వరల్డ్ కప్ అవ్వొచ్చు.
ఫిఫా విమెన్స్ వరల్డ్కప్ (జూలై 20 - ఆగస్టు 20; ఆస్ట్రేలియా, న్యూజిలాండ్)
ఖతార్ వేదికగా నవంబర్–డిసెంబర్లో జరిగిన ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ ఫ్యాన్స్కు కిక్ ఇచ్చింది. ఈ ఏడాది విమెన్స్ వరల్డ్కప్ ఫిదా చేయనుంది. ఈ టోర్నీ తొమ్మిదో ఎడిషన్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 32 దేశాల జట్లు పోటీపడతాయి. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు విజేతలుగా నిలిచిన అమెరికా డిఫెండింగ్ చాంప్గా బరిలోకి దిగనుంది.
ఐఏఏఎఫ్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ (ఆగస్టు 19-27, బుడాపెస్ట్)
అథ్లెటిక్స్లో అల్టిమేట్ ఈవెంట్ అయిన ఐఏఏఎఫ్ వరల్డ్చాంపియన్షిప్ వరుసగా రెండో ఏడాది ఫ్యాన్స్ను కనువిందు చేయనుంది. రెగ్యులర్గా రెండేండ్లకు ఒకసారి జరుగుతుంది. అయితే,18వ ఎడిషన్ (2021) కరోనా వల్ల గతేడాది జరిగింది. ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్చోప్రా సిల్వర్ నెగ్గి హిస్టరీ క్రియేట్ చేశాడు. 19వ ఎడిషన్ షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది ఆగస్టులో హంగేరిలోని బుడాపెస్ట్ లో జరగనుండగా, ఇండియా ఆశలన్నీ నీరజ్పైనే ఉన్నాయి.
ఏషియన్ గేమ్స్(సెప్టెంబర్ 23-అక్టోబర్ 8; హాంగ్జౌ, చైనా)
ఏషియన్ గేమ్స్ షెడ్యూల్ ప్రకారం చైనాలోని హాంగ్జౌలో గతేడాది సెప్టెంబర్లోనే జరగాల్సింది. కానీ, ఆ దేశంలో కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఆసియా ఖండంలో అత్యుత్తమ క్రీడా ఈవెంట్ అయిన ఇందులో 41 క్రీడల్లో 61 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. అయితే, ప్రస్తుతం చైనాలో కరోనా మళ్లీ విజృంభించడం ఆందోళన కలిగిస్తోంది.