శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బినామీ ఆస్తులు గుర్తింపు! త్వరలో నోటీసులు.. బినామీ చట్టం కింద అటాచ్!

 శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బినామీ ఆస్తులు గుర్తింపు! త్వరలో నోటీసులు.. బినామీ చట్టం కింద అటాచ్!
  • 5 రోజుల కస్టడీలో ఆస్తుల వివరాలు రాబట్టిన ఏసీబీ
  • ముగిసిన 5 రోజుల కస్టడీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌  ఈఈ నూనె శ్రీధర్‌‌‌‌‌‌‌‌  బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ  దర్యాప్తులో వెల్లడైంది. స్నేహితులు, బంధువుల పేర్లతో రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌  చేసిన డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులను గుర్తించినట్లు  తెలిసింది. శ్రీధర్  5 రోజుల కస్టడీలో బినామీల గురించి ఆరా తీసినట్లు సమాచారం. వారికి త్వరలోనే నోటీసులిచ్చి విచారించేందుకు ఏసీబీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు అనుమతితో గత శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారం నిందితుడి కస్డడీ ముగియడంతో అదే రోజు శ్రీధర్ ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 

కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు తరలించారు. బినామీల పేర్లతో నిందితుడికి  స్థిరాస్తులు, వ్యవసాయ భూములు ఉన్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఈనెల 11న ఏసీబీ అధికారులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అరెస్టు చేసిన  సంగతి తెలిసిందే. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి సుమారు రూ.150 కోట్లకు పైగా విలువ చేసే స్థిర, చరాస్తులను  గుర్తించారు. ఈ సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కస్టడీలోకి తీసుకుని విచారించారు. 

ఆయన ఇంటితో పాటు బ్యాంకు లాకర్లలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా ఏసీబీ అధికారులు శ్రీధర్‌‌‌‌‌‌‌‌ను‌‌‌‌‌‌‌‌ విచారించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 6, 7, 8 ప్యాకేజీల పనులు, గాయత్రి బాహుబలి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌  ఇన్ చార్జిగా ఉన్న  సమయంలో ఆయన సంపాదన గురించి ఆరా తీశారుఅలాగే, బినామీ చట్టం కింద ఆయా ఆస్తులను అటాచ్‌‌‌‌‌‌‌‌  చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విధుల్లో చేరిన నాటి నుంచి శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  జీతభత్యాలు, కూడబెట్టిన ఆస్తుల వివరాలతో కస్టడీ రిపోర్టును ఏసీబీకి కోర్టుకు అందించనున్నారు.