డ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబడ్డారు

 డ్రైనేజీ పైపుల ద్వారా దేశంలోకి చొరబడ్డారు
  • విజయవాడ, రాజమండ్రిలో 8మంది బంగ్లాదేశ్ దేశస్థుల అరెస్ట్

అమరావతి: దేశంలోకి అక్రమంగా చొరబడిన ఎనిమిది మంది బంగ్లాదేశీయులను ఏపీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. డ్రైనేజీ పైపుల ద్వారా బంగ్లా దేశ్ నుండి బెంగాల్ రాష్ట్రంలో ప్రవేశించిన వీరు.. కోల్ కతా సమీపంలోని హావ్‌డా నుంచి రైళ్లలో ప్రయాణించి రాష్ట్రానికి చేరుకున్నారు. కేంద్ర నిఘా విభాగం ఇచ్చిన సమాచారంతో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే పోలీసుల సహాయంతో  రాజమహేంద్రవరం, విజయవాడ స్టేషన్లలో తనిఖీలు చేసి బంగ్లాదేశీయులను పట్టుకున్నారు. 
నలుగురు బంగ్లాదేశీయులను విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసులు విచారిస్తున్నారు. హావ్‌డా- వాస్కోడిగామా రైళ్లో వస్తున్న వీరి వద్ద ఎలాంటి అధికారిక పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. పాస్‌పోర్టు లేకుండా డ్రైనేజీ పైపుల ద్వారా భారత్‌లోకి వచ్చినట్లు విచారణలో తేలింది.
వీరి వద్ద బెంగళూరు చిరునామాతో నకిలీ ఆధార్‌, పాన్‌ కార్డు, ఓటర్‌ కార్డు ఉన్నట్లు గుర్తించారు. 2017 నుంచి 2019 వరకు వీరు గోవాలో ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. కొవిడ్‌ కారణంగా 2019 తర్వాత బంగ్లాదేశ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ఏడాది జూన్‌లో మళ్లీ భారత్ కు వచ్చి గోవా పరిసరాల్లో కొంత కాలం ఉన్నట్లు విచారణలో వారు వెల్లడించినట్లు సమాచారం. 
బంగ్లాదేశీయుల అరెస్టును పోలీసులు ధృవీకరించారు. ‘‘విజయవాడలో నలుగురు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశాం.. సెల్‌ఫోన్లు, నకిలీ కార్డులు స్వాధీనం చేసుకున్నాం.. ప్రాథమికంగా విచారణ చేశాం.. మరింత విచారించాల్సి ఉంది’’ అని విజయవాడ నార్త్ జోన్‌ ఏసీపీ షానూ షేక్‌ చెప్పారు.