
ములుగు/ తాడ్వాయి/ ఏటూరునాగారం/ గ్రేటర్వరంగల్, వెలుగు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం హేయమైన చర్య అని, తాడ్వాయిలో జర్నలిస్టుపై దాడి చేసిన వారిని గుర్తించి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి వరంగల్ జిల్లా జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఓ పత్రిక ప్రతినిధిగా పని చేస్తున్న చల్లగొండ శ్రీకాంత్రెడ్డిపై దాడి చేయడాన్ని నిరసిస్తూ జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు వ్యక్తం చేశారు.
ములుగులో కలెక్టర్కు, ఆయా మండలాల్లో అధికారులకు దోషులను గుర్తించి చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. కాగా, శ్రీకాంత్ రెడ్డిపై జరిగిన దాడిని మంత్రి సీతక్క ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి పూర్తిస్థాయిలో విచారణ జరిపి దాడికి గల కారణాలను గుర్తించి బాధ్యులను శిక్షించాలని, బాధిత విలేఖరికి సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ఆదేశించారు. బాధిత రిపోర్టర్ను మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు అజ్మీర సీతారాం నాయక్, జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం తదితరులు పరామర్శించారు. తాడ్వాయి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నింధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.