
టాలీవుడ్ హీరో బాలకృష్ణ పుట్టినరోజు నేడు (జూన్ 10). ఈ రోజు 65వ వసంతంలోకి బాలకృష్ణ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా బాలకృష్ణ వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది, చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
బాలకృష్ణ మాట్లాడుతూ..'తన జీవితం అంతా తెరచిన పుస్తకం అని.. రహస్యాలు లేవని చెప్పారు. పేదలకు అందుబాటులో వైద్యం అందించాలని మా అమ్మ గారి కోరిక.. అందుకనే ఈ ఆసపత్రిని స్థాపించామని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ట్రీట్ మెంట్ అందించాలనే సంకల్పంతోనే ఈ ట్రస్ట్ పెట్టానని తెలిపారు. అంతేకాదు తన తండ్రి స్వర్గీయ ఎన్టిఆర్ తనని మెడిసిన్ చదివించాలని కోరుకున్నారని.. ఈ సందర్భంగా తన చదువు ప్రయాణం గురించి గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.
నన్ను మా తండ్రి ఇంటర్మీడియట్ అయిపోయాక మెడిసిన్ చేయమన్నారు. మెడిసిన్కి అప్లై చేసి హాల్ టికెట్ తెచ్చి ఇచ్చారు. ఏరోజైతే పరీక్ష ఉందో.. ఆ రోజు 10 నిమిషాల ముందు పోస్ట్ మెన్ ఇచ్చిన హాల్ టికెట్ తీసుకుని.. కండ్లు మూసుకుని పరీక్షా రాసానని బాలకృష్ణ తెలిపారు. అయితే నటన మీద ఇంటరెస్ట్తో సినీ పరిశ్రమలోకి హీరోగా అడుగు పెట్టా. ఇండస్ట్రీ లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నటుడిగా.. 'నేను తప్ప ప్రపంచంలో ఎవ్వరూలేరు' అని చెప్పారు.
అలాగే తనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ భూషణ్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. ఈ అవార్డ్ తాను చేసిన సేవలకు దక్కిందని అన్నారు. సినిమాల్లో నటించడం వల్ల కాదు.. సామాజిక సేవ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారంతో గౌరవించినట్లు గుర్తుచేశారు.
నటుడిగా, ఆస్పత్రికి ఛైర్మెన్గా, ఒక ఎమ్మెల్యేగా ఎలా ఉండాలో నాన్న ఎన్టీఆర్ను చూసి నేర్చుకున్నాని బాలకృష్ణ తెలిపారు. మనమంతా నిస్వార్థంగా పనిచేద్దామని... ఇకముందు కూడా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.