బీసీ కోటా పెంచకపోతే వదిలిపెట్టం : జాజుల

 బీసీ కోటా పెంచకపోతే వదిలిపెట్టం : జాజుల
  • హైకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు సరిపోతుంది: జాజుల   

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నిక లను సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు ల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కోర్టు తీర్పు అడ్డంకిగా మార బోదని, బీసీ రిజర్వేషన్లు పెంచడానికి కావలసినంత సమయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు కల్పించిందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచడానికి నెల రోజులు సరిపోతుందన్నారు.

 దేశంలో కులగణన చేస్తామని ప్రకటించిన బీజేపీ, కులగణన చేసిన కాంగ్రెస్.. బీసీ రిజర్వేషన్లు పెంచడంలో మాత్రం ఎందుకు తాత్సారం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచకుండా ఎన్నికలకు వెళితే బీసీలు ఎట్టి పరిస్థితుల్లో సహించరని, ఇది ఆయా రాజ కీయ పార్టీలు గ్రహిస్తే మంచిదని హెచ్చరించారు.  రిజర్వేషన్లు పెంచే వరకు ఈ రెండు పార్టీలను వదిలిపెట్టబోమని జాజుల హెచ్చరించారు.