బీసీ స్టూడెంట్లకు బెస్ట్ ట్రైనింగ్

బీసీ స్టూడెంట్లకు బెస్ట్ ట్రైనింగ్
  • అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నం
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
  • రాష్ర్ట సగటు కన్నా బీసీ గురుకులాలకు ఎక్కువ రిజల్ట్స్  వచ్చాయని వెల్లడి
  • గురుకుల టెన్త్  ర్యాంకర్లకు మంత్రి సన్మానం

హైదరాబాద్, వెలుగు: బీసీ విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రతిభ చాటేలా ఉన్నతస్థాయి శిక్షణ అందిస్తున్నామని, ఇందులో భాగంగా సెయిలింగ్ తో పాటు ఎవరెస్ట్  క్లెంబింగ్ లోనూ ట్రైనింగ్  ఇప్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలల పదో తరగతిలో ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంగళవారం హైదరాబాద్  బేగంపేట ఐఏఎస్ ఆఫీసర్స్  క్లబ్ లో మంత్రి పొన్నం సన్మానించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లు, అధికారులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం బీసీ గురుకులాల్లో రాష్ట్ర సగటు కన్నా ఎక్కువ మంది పాస్  అయ్యారని అన్నారు. రాష్ట్ర సగటు 92.78 శాతం అయితే గురుకులాల్లో 97.79 శాతం స్టూడెంట్ల పాస్  పర్సంటేజ్  వచ్చిందని తెలిపారు. ఇద్దరు స్టూడెంట్లు 590, 31 మంది 580, 216 మంది 570 మార్కలు సాధించారని పేర్కొన్నారు. ఈ ఫలితాలు బీసీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న  ఉన్నత విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయని, బీసీ హాస్టల్ లో అందిస్తున్న వసతి సదుపాయాల నాణ్యతను స్పష్టం చేస్తున్నాయని మంత్రి చెప్పారు. 

రాష్ట అవతరణ దినోత్సవాల్లో భాగంగా పరేడ్  గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా స్టూడెంట్లు అవార్డు అందుకోవడం గర్వకారణమన్నారు.  మొత్తం 261 పాఠశాలల్లో 147 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని వెల్లడించారు. గురుకుల విద్యార్థుల్లో చదువుతో పాటు నైపుణ్యం, చురుకుదనం వంటి లక్షణాలను పెంపొందించే లక్ష్యంతో యాచ్  క్లబ్  ఆధ్వర్యంలో హుస్సేన్ సాగర్ లో శిక్షణ ఇచ్చామని తెలిపారు.  రెండు దశల్లో ఇచ్చిన ఈ శిక్షణలో మొదటి దశలో 32 మంది బాలురు, 19 మంది బాలికలు పాల్గొన్నారన్నారు. 

వారిలో ప్రతిభ కనబరిచిన 40 మందిని నెక్స్ట్  లెవెల్ ట్రైనింగ్  కోర్సుకు ఎంపిక చేశామని, వారిలో అత్యంత నైపుణ్యం ప్రదర్శించిన 20 మందికి శిక్షణ ఇస్తామని, అర్హత పొందిన వారికి జాతీయ, అంతర్జాతీయ సెయిలింగ్  పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, బీసీ వెల్ఫేర్  సెక్రటరీ శ్రీధర్, కమిషనర్ బాలమాయాదేవి, అధికారులు పాల్గొన్నారు.