ధరణి కష్టాలు తీరుతున్నయి.. పైలెట్​ మండలం గోపాల్​పేట రైతుల్లో సంతోషం

ధరణి కష్టాలు తీరుతున్నయి.. పైలెట్​ మండలం గోపాల్​పేట రైతుల్లో సంతోషం
  • భూభారతితో భూసమస్యలకు పరిష్కారం 
  • విరాసత్​, ఇనాం భూముల సమస్యలకు చెక్​ 

వనపర్తి, వెలుగు : ధరణి కష్టాలు భూభారతితో తీరాయి. గ్రామాల్లో భూవివాదాలకు, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం అమలులో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్​పేట మండలాన్ని పైలట్​ ప్రాజెక్ట్​కింద ఎంపిక చేశారు. మండలంలోని వివిధ గ్రామాల్లోని భూసమస్యలకు అధికారులు నిర్ధారిత సమయంలో పరిష్కారం చూపారు. 

విరాసత్​, ఇనాం, భూ రికార్డుల్లో పేర్లు, భూ విస్తీర్ణం, సర్వే నంబర్లు తప్పుగా నమోదైతే వాటిని సవరించుకునేందుకు ధరణి అమల్లో ఉన్న సమయంలో తహసీల్దారు నుంచి కలెక్టర్​ వరకు తిరిగి.. తిరిగి రైతులు అలసి పోయారు. ధరణి స్థానంలో తెచ్చిన భూభారతి చట్టం వల్ల మండలస్థాయిలోనే సమస్యకు పరిష్కారం లభించిందని, అధికారుల చట్టు తిరగాల్సిక శ్రమ తప్పిందని రైతులు సంతోషిస్తున్నారు. 

ప్రాజెక్టు మండలంలో 573 అప్లికేషన్లు

భూభారతి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గోపాల్ పేట మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 573 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 171 దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. 80 దరఖాస్తులు సాదాబై నామాలకు సంబంధించినవి ఉన్నాయి. ఆర్డీవో స్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులు 10 , కలెక్టర్ స్థాయిలో పరిష్కరించాల్సిన దరఖాస్తులు 2 ఉన్నాయి. అప్పీల్​ అవకాశం ఉండడంతో భూసమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని రైతులు అంటున్నారు. 

భూభారతిలో న్యాయం జరిగింది .

 72 సర్వే నెంబరులో భూమిలో కాల్వ కోసం ఒక ఎకరా ఐదు గుంటలు భూసేకరణ కింద పోయింది. రికార్డులో మాత్రం ఎకరం 38 గుంటల భూమిని తొలగించారు. ఇందులో నా భర్త ఈశ్వరయ్య పేరు మీద ఉన్న 22 గుంటలు, నా పేరు న ఉన్న 11 గుంటల భూమిని అకారణంగా తొలగించారు. ఆ సమస్య తీర్చాలని ధరణిలో ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా పరిష్కారం కాలేదు. తహసీల్దారు ఆఫీసు, ఆర్డీవో, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండాపోయింది. మొన్న భూ భారతి సదస్సులో అప్లికేషన్​ పెట్టుకుంటే అధికారులు విచారణ జరిపి న్యాయం చేశారు.- లక్ష్మి, చాకలి పల్లి, గోపాల్​పేట. 

ధరణిలో విరాసత్​ కాలే 

నా తండ్రి పేరున ఉన్న ఒక ఎకరం భూమిని విరాసత్ చేయించుకోవడానికి ధరణి లో అప్లై చేశాను. అది ప్రభుత్వ భూమి అని విరాసత్​ చేయలేదు. అధికారుల చుట్టూ కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. భూభారతి రెవెన్యూ సదస్సులో అప్లై చేసుకోగా తండ్రి పేరు ఉన్న భూమిని నా పేరు మీదకు మార్చారు. విరాసత్ చేయడంతో నా సమస్య తీరినందుకు సంతోషంగా ఉంది. - గుండు బాషమ్మ , మున్ననూరు, గోపాల్​పేట.