మొదలైన ఎన్నికల హడావుడి.. ఇప్పటి నుంచే పార్టీల ప్రచారం

మొదలైన ఎన్నికల హడావుడి.. ఇప్పటి నుంచే పార్టీల ప్రచారం

రాష్ట్రంలో ఎన్నికల వాతావారణ మొదలైంది. ప్రధాన పార్టీలు నిత్యం  ప్రజల్లో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాయి.  ఆత్మీయ సమ్మేళనాలు, పాదయాత్రలు, ఆందోళనలతో జనంలోకి   వెళుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి   వెళ్లగా..  నిరుద్యోగ మార్చ్ , పాదయాత్రతో  బీజేపీ ముందుకెళ్తోంది.  దీక్షలు, పాదయాత్రలతో  కాంగ్రెస్ జనంలోకి వెళ్తోంది. 

27న బీఆర్ఎస్ జనరల్ మీటింగ్

ప్రజా సమస్యల కన్నా పార్టీ కార్యక్రమాలకే బీఆర్ఎస్ మొగ్గు చూపుతోంది.  ప్రతిపక్షాల విమర్శలకు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు.  ఇటీవల వచ్చిన టీఎస్ పీఎస్ సీ ఘటన కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్  కానీ ఏ ఇష్యూలపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినా బీఆర్ఎస్ నుంచి  కౌంటర్ లు ఉండటం లేదు. ఏప్రిల్ 27న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జనరల్ మీటింగ్ జరగనుంది.  సుమారు 350 మంది ప్రతినిధులు మాత్రమే ఈ మీటింగ్​లో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. 27న ఉదయం నుంచి సాయంత్రం దాకా పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జాతీయ, రాష్ట్ర స్థాయి అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.

23 అమిత్ షా సభ, ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్

అన్ని  ఉమ్మడి  జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ కు బీజేపీ సిద్దమవుతోంది.  టీఎస్ పీఎస్ సీ ఘటనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. నిరుద్యోగ మార్చ్ లో  బీజేపీ  ముఖ్యంగా  మూడు డిమాండ్ లు  చేస్తోంది. కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం, మంత్రి  కేటీఆర్ ను బర్తరఫ్ చేయడం, టీఎస్ పీఎస్ సీలో ఎగ్జామ్ రాసి నష్టపోయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. 

 ఏప్రిల్  23న హైదరాబాద్ కు కేంద్రమంత్రి అమిత్ షా రానున్నారు.   చేవెళ్లలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు బీజేపీ నేతలు. అలాగే  25న  మహబూబ్ నగర్ లో నిరుద్యోగ మార్చ్,  28న ఖమ్మం జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్,   15న వరంగల్ నిరుద్యోగ మార్చ్ కు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే  బండి సంజయ్ బస్సు యాత్రలకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది.

సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ ప్లాన్
 
ఇప్పటికే పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్  నిరుద్యోగుల సమస్యలపై దీక్షలు చేస్తోంది. టీఎస్పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంపై  జిల్లాల్లో నిరసనలకు సిద్దమవుతోంది కాంగ్రెస్, ఖమ్మండి, అదిలాబాద్, నల్గొండ, పాలమూరు, రంగారెడ్డిలో దీక్షలకు చేయనుంది కాంగ్రెస్ . మే 3 లేదా 4న సరూర్ నగర్ భారీ బహిరంగ సభకు  ప్లాన్ చేస్తున్నారు నేతలు,  ఈ సభకు ప్రియాంక గాంధీ వస్తారని చెబుతున్నారు. అలాగే ఖమ్మంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. జూపల్లి, పొంగులేటిని పార్టీలోకి చేర్చుకుని బలోపేతం చేయాలని చూస్తోంది.