ఎల్బీ నగర్,వెలుగు : బోనాల పండగ రోజు ఫ్రెండ్స్ మధ్య జరిగిన గొడవలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఎల్బీనగర్పోలీసులు, బంధువులు తెలిపిన ప్రకారం.. మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో ఉండే పుట్ట సంజయ్(19) ఈనెల16న బోనాల పండగ రోజు నాగరాజు అనే యువకుడి ఇంటిపైన స్నేహితులతో కలిసి మద్యం తాగారు. అక్కడ జరిగిన గొడవలో సంజయ్ ని అతడి స్నేహితుల్లో కొందరు కొట్టారు. దీంతో సంజయ్ స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి మందు ఎక్కువైందని ఇంట్లో పడుకోబెట్టి స్నేహితుడు రవి వెళ్లిపోయాడు.
మరుసటి రోజు సంజయ్ రక్తంతో వాంతులు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేసిన వైద్యులు తల, కడుపులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. సంజయ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. మృతుడి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదుతో హత్య కేసు నమోదు చేసి నిందితులు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఒక్క కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.