హైదరాబాద్ సిటీలో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు అయ్యింది. అమ్మాయిల అమ్మకం కొనుగోళ్లకు సంబంధించి విచారణలో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా ధరలు ఎలా ఉంటాయి.. ఎలాంటి అమ్మాయికి ఎలాంటి ధర చెల్లిస్తారు.. కొనుగోలు చేసిన అమ్మాయిలను ఎక్కడికి తరలిస్తారు అనే షాకింగ్ విషయాలను వివరించారు అహ్మదాబాద్ పోలీసులు.
చిన్నారుల విక్రయాల కోసం గుజరాత్, హైదరాబాద్ లో భారీ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్న ముఠా గుజరాత్ లో శిశువులను కొని హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఓ మిస్సింగ్ కేసులో రంగంలోకి దిగిన అహ్మదాబాద్ పోలీసులు నలుగురు ఏజెంట్లను అరెస్ట్ చేశారు. ఈ ముఠా రెండు సంవత్సరాల్లో ఏకంగా 25 మంది శిశువులను హైదరాబాద్ లో విక్రయించినట్లు తేల్చారు.
సంతానం లేని వారిని ఆసరగా తీసుకున్న ముఠా ఐవీఎఫ్ లతో కుమ్మక్కై భారీగా సొమ్ము చేసుకుంటోంది. గుజరాత్ లో పుట్టిన శిశువులను, అక్రమ సంతానం ద్వారా కల్గిన పసికందులను రైళ్లు, విమానాలలో హైదరాబాద్ కు తరలిస్తోంది ముఠా. ఇక్కడ పిల్లలు లేని దంపతులను ఆసరగా తీసుకుని ఐవీఎఫ్ సెంటర్ల ద్వారా దత్తత పేరుతో వారికి తక్కువ రేటకు అమ్ముతోంది.
శిశువు రంగు, జెండర్ బట్టి రేట్ ఫిక్స్ చేస్తోంది . అలాగే శిశువు కొద్దిగా ఫెయిర్ ఉంటే రూ. 7 లక్షలకు.. కలర్ తక్కువగా ఉంటే రూ. 4 లక్షలకు అమ్ముతోంది. ఆడపిల్లలకు రూ.5 నుంచి 10 లక్షలు..మగశిశువులకు రూ.10 నుంచి 15 లక్షల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
చైల్డ్ ట్రాఫికింగ్ లో చాలా మంది ఐవీఎఫ్ సెంటర్లో పనిచేసిన వారేనని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఐవీఎఫ్ సెంటర్లపై పోలీసులు నిఘా పెంచారు. సంతానలేమితో బాధపడుతున్న దంపతులు అధికారికంగా దత్తత తీసుకోవాలని..పిల్లలను కొనొద్దని సూచిస్తున్నారు పోలీసులు.
