- బీజేపీ సిద్ధమవుతోందన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
కోల్కతా: ఈ ఏడాది డిసెంబర్లోనే లోక్సభ ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ లీడర్లంతా హెఇకాప్టర్లను కూడా బుక్ చేసుకున్నారని చెప్పారు. సోమవారం టీఎంసీ యువజన విభాగం చేపట్టిన ర్యాలీలో మమతా బెనర్జీ ఈ కామెంట్లు చేశారు. బెంగాల్లో సీపీఎం పాలనకు ముగింపు పలికామని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీని తప్పకుండా ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తోందని, మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, గవర్నర్ సీవీ ఆనంద బోస్ తీరుపై మండిపడ్డ మమత.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాల్కు దిగొద్దంటూ హెచ్చరించారు. రాజ్యాంగేతర యాక్టివిటీస్కు తన సపోర్ట్ ఎప్పటికీ ఉండదని స్పష్టం చేశారు. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు గోలీ మారో నినాదాలు చేశారని, వర్సిటీలో విద్వేష నినాదాలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని పోలీసులకు సూచించానని ఆమె చెప్పారు.
ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలకు పర్మిషన్ ఉండాల్సిందే..
అనుమతుల్లేకుండా కొందరు జనావాసాల్లో ఫైర్ క్రాకర్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. కొందరు పోలీసులు దీనికి సహకరిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నార్త్ 24 పరగణ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ప్రమాదంలో
9 మంది చనిపోయారని గుర్తు చేశారు.