- 8 రాష్ట్రాలకు ప్రత్యేక భవనాల నిర్మాణానికి సహకారం
- ఈశాన్య రాష్ట్రాల వాసులకు తెలంగాణ ‘రెండో ఇల్లు’
- ఆ స్టేట్స్తో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి
- హైదరాబాద్లో ‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్’ టెక్నో కల్చరల్ ఫెస్టివల్
- ప్రారంభించిన తెలంగాణ, త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, ఇంద్రసేనా రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ , ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్ట పరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ హబ్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తమ సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య కళలు, సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణల వంటి అంశాల్లో నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం నిర్వహిస్తున్న తెలంగాణ–నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
దీన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన సతీమణి సుధాదేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో మొట్టమొదటి నార్త్ ఈస్ట్ హబ్ను తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నాయకత్వం వహించాలని కోరారు. ‘‘ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ రెండో ఇల్లు లాంటిది. అక్కడి ప్రజలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్లో ఉన్నారు. ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్, క్రీడల వంటి అన్ని రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సమాజంతో కలిసిపోయి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నారు” అని పేర్కొన్నారు.
కలిసి పనిచేద్దాం..
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 ఈశాన్య రాష్ట్రాలతో కలిసి పని చేయడానికి తెలంగాణ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కూడా అన్ని రంగాల్లో దేశానికి మరింతగా తోడ్పాటు అందిస్తున్నాయని పేర్కొన్నారు. ‘‘ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసే భవనాలు అస్సాం, అరుణాచల్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు అవసరమైన హాస్టల్ సౌకర్యం, ఆహారం, కళలు, చేతి వృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలుగా పని చేస్తాయి.
త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా, తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా పని చేస్తు న్న నేపథ్యంలో ఇప్పటికే బలమైన సంబంధాలను కలిగి ఉన్నాం. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి, ప్రజల మధ్య సంస్కృతుల పరస్పర మార్పిడికి ఈ ఉత్సవాలు నాంది మాత్రమే. తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. ఈ ఫెస్ట్ ఈశాన్య రాష్ట్రాలు, తెలంగాణకు మధ్య ఉన్న ఏకత్వ స్ఫూర్తిని చాటుతున్నది” అని అన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాదాపు 300 మంది ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాల కళాకారులను సత్కరించారు.
గవర్నర్ సహకారం అందించాలి..
హైదరాబాద్ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా ‘చైనా +1’ దేశాల కోసం అన్వేషణలో ఉన్నాయన్నారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, జీసీసీ, డేటా సెంటర్స్, హెల్త్కేర్ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తం. ఈ ప్రణాళికల్లో భాగంగా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళికలతో డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్–2047 గ్లోబల్ సమిట్కు గవర్నర్ నుంచి సంపూర్ణ సహకారం, మద్దతును కోరుతున్నాం. తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లడానికి తెలంగాణ – నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ప్రతినిధుల సహాయం కావాలి” అని కోరారు.
