గద్వాల, వెలుగు:సీఎం రేవంత్ రెడ్డి శనివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన పెండ్లి వేడుకకు హాజరయ్యారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి వివాహం గద్వాలలో జరగగా, సీఎం హాజరై వధూవరులను ఆశీర్వదించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో గద్వాల చేరుకున్న సీఎంకు.. పలువురు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్ ద్వారా అయిజ రోడ్డులోని ఫంక్షన్ హాల్కు చేరుకున్నారు.
నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం.. తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్లిపోయారు. సీఎం వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఉన్నారు.
