
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వేములవాడ, వెలుగు: కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలను పరిశీలించి, అర్హులైన రైతులకు 137 జతల కోడెలను రైతులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే పనులు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
వాటిని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సంరక్షించాలని కలెక్టర్ రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఈఓ రాధాభాయి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధా కృష్ణా రెడ్డి, పశు వైద్యాధికారులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.