బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు దమ్ముందా? : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు దమ్ముందా? : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
  • హరీశ్ రావుకు  కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు బనకచర్ల ప్రాజెక్టు అంశంపై అసెంబ్లీలో  చర్చించే దమ్ము, ధైర్యం ఉందా.. అని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఒకవేళ చర్చించే దమ్ముంటే అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించాలని స్పీకర్‌‌‌‌‌‌‌‌కు లేఖ రాయాలని సవాల్ విసిరారు. బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బనకచర్లపై అసెంబ్లీలో చర్చకు నువ్వు, నీ మామ (కేసీఆర్) ఎందుకు భయపడుతున్నారు? గత పదేండ్లలో తెలంగాణకు నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని అసెంబ్లీ సాక్షిగా మేం బట్టబయలు చేస్తామనే భయమా?’’ అని రామ్మోహన్ రెడ్డి నిలదీశారు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ప్రాజెక్టులపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు.

పదేండ్లలో మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టారు? లక్ష కోట్లు ఖర్చు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. కానీ అది ఎందుకు కూలేశ్వరంగా మారింది? మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోయిందో సమాధానం చెప్పేందుకు సిద్ధమా?’’ అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రాజెక్టులు కట్టినవారికి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించే నైతిక హక్కు లేదనిని రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. బనకచర్ల అంశంపై అసెంబ్లీలో బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, బీఆర్ఎస్ నేతలు సవాల్ స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.