సంక్రాంతి పండక్కి ఊరెళ్తున్నారా.. అయితే, ఈ విషయం మీ కోసమే. తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఊరెళ్లే ముందు మీ నగలు, నగదును భద్రపర్చుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ పోలీసులు గుర్తు చేస్తున్నారు.
కచ్చితంగా మీ పక్కింటి వారికి సమాచారం ఇవ్వాలని, లేదంటే.. స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ వాసులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. ఊరికి వెళ్లే ముందు దగ్గరలోని పోలీస్ స్టేషన్ లేదా బీట్ ఆఫీసర్ కు తెలియజేయాలని సూచించారు. నగదు, బంగారం ఇంట్లో ఉంచొద్దు.. వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు సీపీ సజ్జనార్
మరో వారం రోజుల్లో స్కూళ్లకు సంక్రాంతి సెలవులు రానున్నాయి. సంక్రాంతి పండుగను సంబురంగా జరుపుకొనేందుకు తెలంగాణతో పాటు ఏపీలోని సొంతూళ్లకు వెళ్తారు. ఏపీకి వెళ్లే బస్సులు, ట్రైన్లు ప్యాసింజర్లతో కిక్కిరిసిపోతాయి. అయితే, సిటీ జనం సొంతూళ్లకు వెళ్తుండటంతో.. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగలు చోరీలకు పాల్పడే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. సంక్రాంతి నేపథ్యంలో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోని వారిని అలర్ట్ చేస్తున్నామని చెప్పారు.
కీలక సూచనలు
- సొంతూళ్లకు వెళ్లేవారు చుట్టుపక్కల ఉండే వారికి విషయం చెప్పి తమ ఇంటిని గమనిస్తూ ఉండమనాలి.
- విలువైన వస్తువులను ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ, కారు డిక్కీలో పెట్టొద్దు. బైక్లు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. రోడ్ల పక్కన చేయొద్దు.
- ఊళ్లకు వెళ్లే వారు ఇంట్లోని బీరువా తాళాలను వారి వెంటే తీసుకెళ్లాలి. ఇంటికి తాళం వేసిన తర్వాత కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి .
- సొంతూళ్లకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక రూమ్లో లైట్ వేసి ఉంచాలి. ఇంటి ముందు చెత్త, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు జమ కాకుండా చూడాలి.
- పని మనుషులు ఉంటే రోజూ వాకిలి ఊడ్చమని చెప్పాలి. విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
- బంగారు నగలు, క్యాష్ ఉంటే వాటిని బ్యాంక్ లాకర్లలో భద్రపరుచుకోవాలి.
- బ్యాగుల్లో బంగారు నగలు, డబ్బు పెట్టుకొని బస్సులు, రైళ్లలో జర్నీ చేస్తున్నప్పుడు ఆ బ్యాగ్ను కూర్చున్న సీటు దగ్గరే పెట్టుకోవాలి.
- ఇంటి డోర్కు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలను ఆన్లో ఉంచి మొబైల్కు కనెక్ట్ చేసుకొని గమనిస్తూ ఉండాలి.
- కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లలో కమిటీలను నియమించుకొని వాచ్ మన్లను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
- సొంతూళ్లకు వెళ్లే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయొద్దు.
- దూర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్ను సంబంధిత పీఎస్లో ఇవ్వాలి. పోలీసులు ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేసుకొని ఆ ఇంటి వద్ద గస్తీ ఏర్పాటు చేస్తారు.
- కాలనీల్లో దొంగతనాల నివారణకు స్వచ్ఛందంగా కమిటీలను నిర్వహించుకోవాలి. ఈ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద, కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ చేయాలి
