Vaibhav Sooryavanshi: ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. రాబోయే జూలై 1 నుంచి ఈ సుదీర్ఘ పోరు ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ (BCCI) ఈ సిరీస్ నుంచే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే టీ20 వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు ఈ టూర్ కి రెస్ట్ ఇచ్చింది. టీ20 ఫార్మాట్ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ భుజాలపై పెట్టింది.
ఫ్యాన్స్ స్పందించాల్సిన అవసరం లేదు:
ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించకపోయినప్పటికీ.. ఫ్యాన్స్ ఎవరూ అతిగా స్పందించాల్సిన అవసరం లేదని టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. అక్కడి విభిన్నమైన వాతావరణ పరిస్థితుల వల్లే మన బ్యాటింగ్ లైనప్ తడబడిందని, ప్లేయర్స్ కి కనీసం వారం రోజులు ప్రిపరేషన్ టైమ్ దొరికి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని స్పష్టం చేశాడు. అంతేకాదు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీని ఆకాశానికెత్తాడు. అయ్యర్ ఎంతో ప్రశాంతంగా, సంయమనంతో జట్టును నడిపిస్తాడని.. గెలుపోటములకు లొంగిపోకుండా స్థిరంగా ఉండే ఇలాంటి లీడరే ప్రస్తుత యువ జట్టుకు అవసరమని అంబాటి రాయుడు కొనియాడాడు.
వైభవ్పై సందేహాలెందుకు?:
ఈ పర్యటనలో అందరి కళ్లూ ఐపీఎల్ 2026 సీజన్లో 700కు పైగా రన్స్, 230+కి పైగా స్ట్రైక్ రేట్తో చెలరేగిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఐర్లాండ్ సిరీస్లోనే అతను అరంగేట్రం (Debut) చేస్తాడని భావించినా.. బీసీసీఐ మాత్రం ఇంగ్లాండ్ సిరీస్ కోసం అతన్ని దాచి ఉంచింది. అయితే వైభవ్ డెబ్యూ కంటే ముందే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వయస్సుకు సంబంధించిన ఒక వింత ప్రోటోకాల్ను తెరపైకి తెచ్చింది.
ALSO READ ; మా దగ్గర ఐదు వరల్డ్కప్లు ఉన్నాయి..
ఈసీబీ చైల్డ్ సేఫ్గార్డింగ్ రూల్స్:
ఈసీబీ చైల్డ్ సేఫ్గార్డింగ్ రూల్స్ (Child Safeguarding Policy) ప్రకారం.. 16 ఏళ్ల లోపు వయసున్న మైనర్ ఆటగాళ్లు ఎవరూ సీనియర్ ఆటగాళ్లతో కలిసి ఒకే డ్రెస్సింగ్ రూమ్ లేదా షవర్ ఫెసిలిటీస్ను పంచుకోకూడదు. దీనివల్ల ఇంగ్లాండ్ టూర్లో వైభవ్కు ప్రత్యేకంగా ఒక సెపరేట్ చేంజింగ్ రూమ్ కేటాయించనున్నారు. కానీ అతను మ్యాచ్ స్ట్రాటజీ, టీమ్ మీటింగ్స్ సమయంలో మెయిన్ డ్రెస్సింగ్ రూమ్లోనే ఉంటాడని, కేవలం బట్టలు మార్చుకునే సమయంలో మాత్రమే ఈ రూల్ వర్తిస్తుందని మేనేజ్మెంట్ తెలిపింది.
