గౌరవెల్లి కాల్వ పనులు కంప్లీట్​ చేయాలి : సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి

గౌరవెల్లి కాల్వ పనులు కంప్లీట్​ చేయాలి : సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: గౌరవెల్లి ప్రాజెక్ట్ ఎడమ కాల్వ పనులను వెంటనే పూర్తిచేయాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి డిమాండ్​చేశారు. గురువారం అక్కన్నపేట మండలం రేగొండలో గౌరవెల్లి ప్రాజెక్టు ఎడమ కాల్వను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..2007లో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి సీఎం వైఎస్  రాజశేఖర్ రెడ్డి గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. అప్పుడు యుద్ధ ప్రాతిపదికన 1.29 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టామన్నారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవెల్లి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 8 టీఎంసీలకు పెంచి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

 ప్రస్తుతం మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో రాష్ట ప్రభుత్వం ప్రాజెక్టు నుంచి కాల్వల నిర్మాణానికి రూ.437 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కానీ నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు ఎందుకు ముందుకెళ్లడం లేదని ప్రశ్నించారు. ఎడమ కాల్వ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సాగునీటి కోసం మెట్ట ప్రాంత రైతులు ఎదురుచూస్తున్నారన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. 

ముందు హుస్నాబాద్​లో అక్కన్నపేట ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా కార్యదర్శి మంద పవన్​తో కలిసి పాల్గొన్నారు. అనంతరం అక్కన్నపేట మండలం నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల కార్యదర్శిగా కొమ్ముల భాస్కర్​ను ఎన్నుకున్నారు. సమావేశంలో సత్యనారాయణ, వనేశ్, జనార్దన్, శ్రీను, మోహన్​రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, రాజేందర్​పాల్గొన్నారు.