మెదక్ టౌన్, వెలుగు : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఖాళీ స్థలానికి యాజమాన్య ధ్రువపత్రంతో పాటు ఇంటి నెంబర్, అసెస్మెంట్ ఇచ్చి విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలను సస్పెండ్ చేసినట్లు మెదక్ జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య బుధవారం తెలిపారు.
చిన్నశంకరంపేట గ్రామపంచాయతీలో వివాదంలో ఉన్న స్థలంలో సరైన లింక్ డాక్యుమెంట్లు, స్థల పరిశీలన చేయకుండా ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వడంతో పంచాయతీ కార్యదర్శులు ఆర్ సంతోష్ కుమార్, సీహెచ్ ప్రదీప్ కుమార్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు వారు ప్రస్తుత కార్యస్థానాలు విడిచి వెళ్లరాదని డీపీవో యాదయ్య సూచించారు.
