- కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా సదస్సు
- 5న ప్రారంభించనున్న సీఎం రేవంత్
- పాల్గొననున్న14 రాష్ట్రాల సైబర్ నిపుణులు, పోలీసు అధికారులు
హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరాల కట్టడికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) వినూత్న ఆవిష్కరణలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏటా ‘షీల్డ్ 2026’ పేరిట ఒకరోజు సైబర్ కాన్ క్లేవ్ నిర్వహిస్తోంది. బంజారా హిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా ఈనెల 5న జరుగనున్న ఈ కాన్క్లేవ్ను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ నేతృత్వంలో జరగనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 14 రాష్టాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు, ఐటీ నిపుణులు, ఇండస్ట్రీస్, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు పాల్గొననున్నారు.
సదస్సులో పాల్గొనేవారికి రిజిస్ట్రేషన్ల ఇప్పటికే ప్రక్రియ పూర్తయ్యింది. ఇందులో దేశవిదేశాలకు చెందిన 650 మంది ప్రతినిధులు సహా 250 మందికి పైగా సైబర్ వారియర్స్, విద్యార్థులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించనున్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ టెక్నాలజీ, డార్క్ వెబ్ అండ్ డీప్ వెబ్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా మానిటరింగ్ అండ్ అనాలసిస్ అంశాలపై షీల్డ్ 2026లో ప్యానెల్ డిస్కషన్లు నిర్వహించనున్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే అడ్డుకట్ట వేయగలమని సీఎస్ బీ డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం ఒక ప్రకటనలో అన్నారు. నిరుడు దేశవ్యాప్తంగా 24% సైబర్ నేరాలు పెరిగినప్పటికీ రాష్ట్రంలో 2% తగ్గాయని ఆమె చెప్పారు. సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ఏటా ‘షీల్డ్’ పేరిట సైబర్ సేఫ్టీ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
