ప్రజల ఆకాంక్షలే ఎజెండా : మల్లు భట్టి విక్రమార్క

ప్రజల ఆకాంక్షలే ఎజెండా : మల్లు భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
  • పదేండ్లలో బీఆర్​ఎస్​ చేసిందేమీలేదు 

అడ్డాకుల/నవాబుపేట, వెలుగు : ప్రజల ఆశలు, ఆకాంక్షలే ఎజెండాగా కాంగ్రెస్​ ప్రభుత్వం పాలన అందిస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా మూసాపేట, నవాబుపేటల్లో 33/11 కేవీ, 132/33 కేవీ విద్యుత్​ సబ్​ స్టేషన్​లకు శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. 

 శ్రీశైలం మొదలుకొని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​, భీమా, కల్వకుర్తి స్కీములను కాంగ్రెస్​ హయాంలోనే కట్టామని భట్టి చెప్పారు. 'పాలమూరు' స్కీంను కూడా కాంగ్రెస్​ హయాంలోనే జీవో వచ్చిందని, బీఆర్​ఎస్​అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ప్రారంభమయ్యాయన్నారు. 2015 జూన్​లో కర్వేన వద్ద పునాది వేసిన అప్పటి సీఎం కేసీఆర్ మూడేండ్లలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చి పదేండ్లయినా నీళ్లు ఇవ్వలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడిగా నార్లాపూర్ వద్ద ఒక పుంపును స్విచ్ ఆన్ చేసి వెంటనే బంద్ చేశారని, పాలమూరు బంగారం అయ్యిందని అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టులపై ఫోకస్​ పెట్టిందన్నారు. 

ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 'పాలమూరు' స్కీంను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆర్​అండ్​ఆర్​, భూ సేకరణకు సంబంధించి వెంటనే నిధులు విడుదల చేస్తామన్నారు. నార్లాపూర్, ఏదుల రిజర్వాయర్ల మధ్య ఉన్న గ్యాప్​ను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు. ఉదండాపూర్​ ఆర్​అండ్​ఆర్​ ప్యాకేజీకి రూ.70 కోట్లు అవసరం కాగా.. విడుదల చేశామన్నారు. సీఎం రేవంత్​రెడ్డి కూడా ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. 

 బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో ఎలాంటి డెవలప్​మెంట్​జరగలేదని డిప్యూటీ సీఎం విమర్శించారు. మహిళలకు రుణాలు ఇవ్వలేదని, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చలేకపోయారని ఫైర్​ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చాక మహిళలు డ్వాక్రా రుణాలు అందిస్తున్నామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, గిరిజనుల కోసం ఇందిర సౌర గిరి జల వికాసం తీసుకొచ్చామన్నారు. అనంతరం నాగలి, గొర్రె పిల్ల, గొంగడితో డిప్యూటీ సీఎంను పలువురు సన్మానించారు. 

డిగ్రీ కాలేజీతో కష్టాలు తీరాయి..

 దేవరకద్ర నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేకపోవడంతో స్టూడెంట్లు పాలమూరుకు పోవాల్సివచ్చేదని, బీఆర్​ఎస్​ ప్రభుత్వం పదేండ్లలో డిగ్రీ కాలేజీని మంజూరు చేయలేదని ఎమ్మెల్యే జి.మధుసూదన్​ రెడ్డి అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన మూడు నెల్లలోనే డిగ్రీ కాలేజ్​ మంజూరు చేయించుకున్నట్టు చెప్పారు. కాలేజీకి కొత్త బిల్డింగ్​ మంజూరు చేయాలని కోరారు. మూసాపేట మండలంలో కూడా డిగ్రీ కాలేజ్​ మంజూరైందని, పేరూర్, కొత్తకోట, చిన్నచింతకుంటలోని 30 పడకల ఆసుపత్రులను త్వరలో అప్​గ్రేడ్​ చేస్తున్నామన్నారు. మన్యంకొండ వద్ద చౌదర్​పల్లి లిఫ్ట్ స్కీంకు ప్రతిపాదనలు ఇచ్చామని, అనుమతులు ఇవ్వాలని ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంను కోరారు.

ఉదండాపూర్​ బాధితులను రోడ్ల వెంట తిప్పారు

 ఉదండాపూర్​ రిజర్వాయర్​ ముంపు బాధితులకు గత ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించకుండా రోడ్ల వెంట తిప్పిందని ఎమ్మెల్యే అనిరుధ్​ర రెడ్డి ఫైర్​ అయ్యారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఉదండాపూర్​ ఇష్యూపై సీఎంతో చర్చించామన్నారు. డిప్యూటీ సీఎం సహకారంతో వారికి న్యాయమైన పరిహారం అందించేలా కృషి చేస్తానన్నారు. తాను 20 ఏండ్ల విజన్​తో పని చేస్తున్నానని, జడ్చర్ల నియోజకవర్గాన్ని రాష్ర్టానికే మోడల్​గా నిలుపుతామన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్​ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, తుడి మేఘారెడ్డి, చిట్టెం పర్ణికారెడ్డి, మైనారిటీ కార్పొరేషన్​ చైర్మన్​ ఒబేదుల్లా కొత్వాల్​, డీసీసీబీ చైర్మన్​ మామిళ్లపల్లి విష్ణువర్ధన్​ రెడ్డి, మాజీ జడ్పీ చైర్​పర్సన్​ స్వర్ణా సుధాకర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.