ధర్మసాగర్‌‌ రిజర్వాయర్‌‌ దగ్గర క్వారీ పర్మిషన్‌‌ రద్దుకు సిఫార్సు !

ధర్మసాగర్‌‌ రిజర్వాయర్‌‌ దగ్గర క్వారీ పర్మిషన్‌‌ రద్దుకు సిఫార్సు !
  • బ్లాస్టింగ్‌‌ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆఫీసర్లు

హనుమకొండ/ధర్మసాగర్, వెలుగు : క్వారీ బ్లాస్టింగ్స్‌‌తో ప్రమాదంలో పడ్డ ధర్మసాగర్‌‌ రిజర్వాయర్‌‌ రక్షణకు ఆఫీసర్లు చర్యలు ప్రారంభించారు. రిజర్వాయర్‌‌ పక్కనే క్వారీ నడవడం, బ్లాస్టింగ్‌‌లు జరగడంపై శుక్రవారం ‘ధర్మసాగర్‌‌ రిజర్వాయర్‌‌కు బ్లాస్టింగ్‌‌ ముప్పు’ అంటూ ‘వెలుగు’ పేపర్‌‌లో పబ్లిష్‌‌ అయిన వార్తకు ఆఫీసర్లు స్పందించారు. ఈ క్రమంలో వరంగల్‌‌ మైనింగ్‌‌ డీడీ ఆర్.సాయినాథ్, ఇరిగేషన్‌‌ ఈఈ ప్రశాంతి, హనుమకొండ మైనింగ్ ఏడీ ఎ.రవిశంకర్‌‌ శుక్రవారం ర్ ధర్మసాగర్ రిజర్వాయర్‌‌ను, క్వారీని తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా బ్లాస్టింగ్‌‌ జరిగినట్లు గుర్తించిన ఆఫీసర్లు పూర్తి వివరాలతో రిపోర్ట్‌‌ రెడీ చేశారు. బ్లాస్టింగ్స్‌‌ కారణంగా రిజర్వాయర్‌‌కు ప్రమాదం పొంచి ఉండడంతో క్వారీ పర్మిషన్‌‌ రద్దుకు సిఫార్సు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మైనింగ్ డిపార్ట్‌‌మెంట్‌‌ లెటర్‌‌ రాయాల్సిందిగా ఇరిగేషన్‌‌ ఆఫీసర్లకు సూచించారు. వారి వెంట ఇరిగేషన్‌‌ ఏఈఈ ఎం.అరవింద్, మైనింగ్‌‌ ఆర్‌‌ఐలు ఎస్.నరేశ్, వి.చంద్రకళ ఉన్నారు. 

జిలెటిన్‌‌ స్టిక్స్‌‌ రవాణాపై ఇంటెలిజెన్స్‌‌ ఆరా...

రిజర్వాయర్‌‌ను ఆనుకుని ఉన్న క్వారీలో జిలెటిన్‌‌ స్టిక్స్‌‌తో పేలుళ్లకు పాల్పడుతున్న విషయంపై ఇంటెలిజెన్స్‌‌ వర్గాలు సైతం విచారణ జరుపుతున్నాయి. ‘వెలుగు’ కథనంతో రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్‌‌ వర్గాలు.. అసలు జిలెటిన్‌‌ స్టిక్స్‌‌ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయన్న కోణంలో ఆరా తీస్తున్నాయి. గతంలో కూడా ధర్మసాగర్ మండల కేంద్రంలో జిలెటిన్‌‌ స్టిక్స్‌‌తో బ్లాస్టింగ్స్‌‌ జరుగగా, వాటిని ఎవరు తీసుకు వస్తున్నారనే వివరాలు సేకరిస్తున్నాయి.