చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి ..9 రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీలు

చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి ..9 రోజుల తర్వాత దొరికిన డెడ్ బాడీలు

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు చిన్నారుల మిస్సింగ్​ విషాదంగా మిగిలింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ చెరువులో చిన్నారులు పడి చనిపోగా వీరి డెడ్​బాడీలు శనివారం బయటపడ్డాయి. టౌన్​  సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని గోసింగి కాలనీకి చెందిన పనేటి సింహాద్రి అలియాస్​ నరసింహ(10),  ఇతని బంధువు కోదండ విజయ్(9) ఈ నెల 6న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 

చుట్టు పక్కల, బందువుల ఇండ్లలో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదు. దీంతో సింహాద్రి తల్లి  పనేటి శారద తన కొడుకుతో పాటు తన అన్న కొడుకు విజయ్​ కనిపించడం లేదని ఈ నెల 7న టౌన్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పెషల్​ టీమ్స్​ ఏర్పాటు చేసి ఇద్దరు పిల్లల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. రాజీవ్​నగర్​ కాలనీ సమీపంలోని  చెరువులో ఇద్దరు చిన్నారుల డెడ్​బాడీలు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడకు వెళ్లి పరిశీలించారు. గోసంగి కాలనీ నుంచి మిస్సింగ్  అయిన ఇద్దరు చిన్నారులేనని నిర్ధారించారు. చేపలు పట్టేందుకు వెళ్లి  ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయినట్లు ఆనవాళ్లు ఉన్నాయని సీఐ తెలిపారు.