మాటలకు మోసపోవద్దు.. పనిచేసే పార్టీని ఆశీర్వదించండి

మాటలకు మోసపోవద్దు.. పనిచేసే పార్టీని ఆశీర్వదించండి
  • జమ్మికుంట ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో మంత్రి హరీష రావు

కరీంనగర్: వారి వీరి మాటలు విని మోసపోకుండా పనిచేసే పార్టీని ఆశీర్వదించాలని ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు కోరారు. గురువారం జమ్మికుంటలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ తో కలసి కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడా అన్యాయం చేయలేదని పునరుద్ఘాటించారు. కేసీఆర్ ఈటలకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి అంచెలంచెలుగా ఈ స్థాయికి తెచ్చారన్నారు. రైతుబంధు కూడా హుజురాబాద్ లోని శాలపల్లి నుంచే కేసీఆర్ ప్రారంభించి ఆ సభలో ఈటల రాజేందర్ నాకు “కుడిభుజమని, నాకు తమ్ముడని”  కేసీఆర్ ఎంతో గొప్పగా చెప్పారని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్ ను పట్టుకుని ఇప్పుడు ఘోరీ కడుతానని ఈటల మాట్లాడుతున్నాడని అభ్యంతరం వ్యక్తం చేశారు. మనల్ని ఎవరైనా పెద్దస్థాయికి తెస్తే జీవితాంతం రుణపడి ఉంటారు. కానీ ఈటల మాటల తీరు ఎలా ఉందో ఆలోచించండి, ఆయన భాషను, మాటలను ఎవరైనా హర్షిస్తారా ? అని ప్రశ్నించారు. 
కేసీఆర్ లేకుంటే నీకు ఈ స్థాయి ఉండేదా? అటువంటి కేసీఆర్ పై ఇలాంటి భాష వాడితే ఎవరూ ఒప్పుకోరనన్నారు. నన్ను కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. నేను మాత్రం ఈటలను “గారు” అనే గౌరవిస్తున్నా, మీరు మాత్రం కేరళ నుంచి మన భాష తెలియని కేంద్రమంత్రిని తీసుకురావచ్చు.. కానీ నేను ఇక్కడికొచ్చి మాట్లాడితే తప్పా? అని ప్రశ్నించారు. నేను ఇక్కడికి వచ్చి ఏం తప్పు చేశాను, ప్రజలడిగిన పనులు చేస్తున్నాం, అది ప్రభుత్వం బాధ్యత అన్నారు.

ఈటల రాజేందర్ మాటలు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను, గౌరవాన్ని దెబ్బతీసేవిధంగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారని, ఎన్ని చేసినా ఇక్కడ గెలిచేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. ఆర్యవైశ్యులు తమ కుల సంఘానికి స్థలం కావాలంటే మీకెందుకని ఈటల అన్నారని మీరే చెప్పారని గుర్తు చేశారు. అగ్రవర్ణాల్లోని పేదల కోసం ఈబీసీ కింద పది శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారని, పేదరికానికి కులం అడ్డం ఉండకూడదని.. ఏ ప్రభుత్వం చేయని విధంగా కల్యాణ లక్ష్మి, ఆసరా ఫించన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు వైశ్య కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని, కరోనా వల్ల కొంత ఆలశ్యమైందన్నారు. ఆర్యవైశ్యుల్లోని చాలా మందికి రాజకీయంగా కీలక పదవులిచ్చి కేసీఆర్ గౌరవించారని, వైశ్యుల్లోని పేదలకు సహాయం చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు సహాయం చేస్తాం. స్థలం లేనివారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామన్నారు. తెలంగాణ వచ్చాక.. ఇక్కడ భూముల ధరలు పెరిగాయని, ఇక్కడ ఎకరం భూమి అమ్మితే ఆంధ్రాలో రెండు ఎకరాలు కొనుక్కోవచ్చుని గతంలో ఇందుకు విరుద్ధంగా ఉండేదన్నారు.  
ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి కొత్తహామీలు ఇవ్వలేను, పాతహామీలన్నీ నెరవేరుస్తామన్నారు. కోడ్ పూర్తయ్యాక.. మీకు కావాల్సిన సహకారం అందిస్తామన్నారు. మేము మాట తప్పితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ మీ దగ్గరకు ఎలాగు వస్తాం కాబట్టి అప్పుడు నిలదీయండని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆర్యవైశ్యులు ఒక్కొక్కరు 100 మందిని ప్రభావితం చేయగల సత్తా ఉందన్నారు. మాటలకు మోసపోకుండా పనిచేసే పార్టీని ఆశీర్వదించాలని మంత్రి హరీష్ రావు కోరారు.